తాడేపల్లి: సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు.
దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలి. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్స్టేషన్ ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైయస్ జగన్ హోంశాఖపై సమీక్ష నిర్వహించారు.
