హైదరాబాద్: చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయంలో మసీదులు, చర్చిలను సైతం కూలగొట్టారు. దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. టీటీడీ బంగారం తరలింపుపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను, ఆ తర్వాత ముగ్గురు అర్చకులను తొలగించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించారు. ఉత్తరాదికి చెందిన అనిల్కుమార్ సింఘాల్ను టీటీడీ ఈఓగా నియమించారు. దొంగతనం, దోపిడీ చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం ఇవన్నీ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. టీటీడీకి చెందిన బంగారం చెన్నై నుంచి తిరుపతి తరలించేటప్పుడు హైవేపై రాకుండా.. వేపం పట్టు అనే లోపలి రోడ్డు నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది?. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాలు చోరీ చేశారు.. ఇద్దరు జేబు దొంగలను పట్టుకుని కిరీటాలు వారే కాజేశారని మభ్యపెడుతున్నారు. వాళ్లు కిరీటాలను కరిగించారని చెబున్నారు. ఏ ఇంటిని సోదా చేస్తే కిరిటీలు దొరుకుతాయో పోలీసులకు తెలుసు. విజయవాడలో నలభై దేవాలయాలను చంద్రబాబు కూలగొట్టారని తెలిపారు. వాటిని కట్టిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. టీటీడీ బంగారం తరలింపుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమించిన కమిటీ నివేదిక సమర్పించాక.. అందులోని వివరాలను బయటపెట్టాలి. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పైన కాంగ్రెస్ హయంలో పెట్టినవి దొంగ కేసులేనని తెలిపోయింది. ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం ఈసీ నిబంధనలకు వ్యతిరేకం. టీడీపీ నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా ఫిర్యాదు చేసితీరుతామ’ని తెలిపారు.