చంద్ర‌బాబే మాపై టీడీపీ ఎమ్మెల్యేల‌తో దాడి చేయించారు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలి

అమ‌రావ‌తి: ఇవాళ అసెంబ్లీలో చంద్ర‌బాబు టీడీపీ ఎమ్మెల్యేల‌తో త‌న‌పై దాడి చేయించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  శాసనసభలో స్పీకర్ పై టీడీపీ సభ్యుల దౌర్జన్యం, అడ్డుకున్నందుకు వైయ‌స్ఆర్‌సీపీ దళిత ఎమ్మెల్యేలపై టీడీపీ నేత‌లు దాడి చేశారు.  టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు  మీడియాతో మాట్లాడారు.

 ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్‌ డే. బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం గారి మీద చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం దాడి చేయించారు. ప్రతిరోజు పేపర్లు చింపటం, ప్లకార్డులు మొహం మీద పెట్టడం, విసిరివేయడం.. స్పీకర్‌ గారిని పదే పదే అవమానించటం వంటివి చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సభాపతిపై దాడి చేయబోతే ఎమ్మెల్యే ఎలీజా గారు సభాపతిని తాకనివ్వకుండా చేయి అడ్డు పెట్టం జరిగింది. టీడీపీ సభ్యులు అంతా నెడుతుంటే ఎమ్మెల్యే ఎలీజాని కాపాడటం కోసం పోడియం పైకి వెళ్తే.. నన్ను అగ్రవర్ణానికి చెందిన బెందాళం అశోక్‌ దారుణాతిదారుణంగా తిట్టి తోసేశారు. దాంతో నా చేతికి గాయమైందని దెబ్బ చూపించిన సుధాకర్‌బాబు.  చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేదు. వాయిదా తీర్మానం ఇవ్వటం, అసంబద్ధంగా మాట్లాడుతూ టీడీపీ శాసనసభ్యుల్ని పంపి దాడి చేయించారు. తక్షణమే ఆ విజువల్స్‌ను స్పీకర్‌ గారు పరిశీలించి, ఎవరైతే మా మీద దాడికి పాల్పడ్డారో ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, చర్యలు తీసుకోవటంతో పాటు, మాకు రక్షణ కల్పించాలని వేడుకొంటున్నాం. మా పార్టీకి 151 మంది శాసనసభ్యులు ఉంటే ఇలా దాడి చేశారు. చంద్రబాబు ఎటూ శాసనసభకు రావట్లేదు కాబట్టి, సభ సవ్యంగా జరగకూడదని, అరాచకాలు చేసి,  గందరగోళం సృష్టించాలని ఆయన  కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర తెల్సిన వారు ఎవరైనా.. ఇవాళ జరిగిన సంఘటన చంద్రబాబు చేయించినదేనని చెబుతారు.  కొండేపి ఎమ్మెల్యే బాల వీరంజనేయస్వామి ప్లకార్డులు, పేపర్లు పట్టుకొని ప్రతిరోజు సభాపతిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. చిట్టచివరకు అగ్రవర్ణాల ఎమ్మెల్యేతో మా మీద దాడి చేయించారు. దీని మీద చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు.

Back to Top