కాకినాడ: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ సచివాలయ పైలాన్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవిష్కరించారు. 73వ రాజ్యాంగ సవరణ మేరకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ చేస్తూ ప్రజలకు అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చేందుకు రాష్ట్రంలో 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 13 రకాల ఉద్యోగాలను కల్పిస్తూ..ఇటీవల నియామకాలు కూడా పూర్తి చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సచివాలయ భవనాలను ప్రారంభిస్తున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఎప్పుడు కూడా చరిత్రలో 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రామాల్లో 500 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డికే దక్కింది. సొంత ప్రాంతంలో ఉద్యోగాలు లభించడంతో యువత హర్షం వ్యక్తం చేస్తుండగా, తమ గ్రామంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం దక్కడం పట్ల యావత్తు రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టాల్స్ సందర్శించిన సీఎం వైయస్ జగన్ కరప హైస్కూల్ ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. ఒక్కో స్టాల్ను నిశితంగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.