ఆనంద‌య్య మందు పంపిణీకి గ్రీన్‌సిగ్న‌ల్‌

సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణయం

కంట్లో వేసే ‘కే’ రకం మందుకు అనుమతి నిరాక‌ర‌ణ‌

తాడేప‌ల్లి: కరోనా రోగుల కోసం ఆనందయ్య త‌యారు చేసిన మందు పంపిణీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇ‍చ్చే పీ,ఎల్‌,ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు.

మిగిలిన మందులు ఆపవద్దు..
కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది.

మందు కోసం కోవిడ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని, ఆనందయ్య మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశించింది. 

తాజా వీడియోలు

Back to Top