అమరావతి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొలిక్కి వచ్చాయి. రాత్రి లోపు ప్రతిష్టంభన తొలగిపోయేలా చర్చలు కొనసాగుతున్నాయి. సచివాలయంలో ఐదు గంటలుగా చర్చలు కొనసాగుతున్నాయి. హెచ్ఆర్ఏ స్లాబ్లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్ అడ్జస్ట్మెంట్, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లపై చర్చ జరుగుతుంది. ఏకాభిప్రాయం దిశగా చర్చలు సాగుతున్నాయి. కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది.