కాకినాడ: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీపై టీడీపీ మూకలు జరిపిన దాడిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన నేరుగా దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ప్రజాసేవ చేయమని, ప్రతిపక్షాలపై, అమాయక ప్రజలపై దాడులు చేయమని కాదని ఆయన స్పష్టం చేశారు. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం అత్యంత ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఇవాళ తమ చేతిలో అధికారం ఉందనే అహంకారంతో ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ముద్రగడ విమర్శించారు. అధికారం శాశ్వతం కాదన్న సత్యాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించడంలేదని ప్రశ్నించారు. “అధికారం మారితే మీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో చంద్రబాబు ఎందుకు ఆలోచన చేయరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఇలాంటి దాడులకు పాల్పడలేదా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. రాష్ట్రం టీడీపీ ఎస్టేట్ కాదని, ప్రజలు ఎవరి బానిసలు కాదని ముద్రగడ పద్మనాభం ఘాటుగా వ్యాఖ్యానించారు. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి నిరంకుశ, అహంకార పాలన జరిగినట్లు చరిత్రలో దాఖలాలు లేవని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలని, ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని టీడీపీ ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం సూచించారు. ప్రజలు తిరగబడితే పరిస్థితి ఏమిటో ఇప్పుడే ఆలోచన చేయాలని ఆయన హెచ్చరిక జారీ చేశారు. మాజీ మంత్రులపై జరిగిన దాడి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ఇలాంటి చర్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ముద్రగడ స్పష్టం చేశారు.