అమరావతి: కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. జాతీయ చానెల్ ఎన్డీటీవీ ఆదివారం అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైయస్ఆర్ సీపీ 20 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎన్నికల అనంతరం ప్రబల శక్తిగా ఆవిర్భవించి దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ చానెళ్లు ఇప్పటికే తమ సర్వేల ద్వారా అంచనా వేయడం తెలిసిందే. ఏపీలో వైయస్ఆర్ సీపీ స్వీప్ చేస్తుందని, తిరుగులేని విజయం సాధించి లోక్సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ప్రజలు స్పష్టంగా వైయస్ఆర్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైయస్ఆర్ సీపీ 20 – 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి. టైమ్స్ నౌ, సీఎన్ఎన్ న్యూస్ 18, ఇండియా టుడే తదితర జాతీయ చానెళ్లు వైయస్ జగన్పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ప్రముఖ జర్నలిస్టులు రాజ్దీప్ సర్దేశాయి, బర్కాదత్, నావికా కుమార్ తదితరులు వైయస్ జగన్తో సంభాషించి ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో ఆయన అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అతి త్వరలోనే వైయస్ జగన్ దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇవన్నీ సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.