చిన్నారులంతా చదువుకోవాలి. పేదరికం వారి అభివృద్ధికి అడ్డు కాకూడదు అన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పం. పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సహకంగా 15,000 రూపాయిలు అందించేలా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారు. తొలుత ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అని చెప్పినా సమీక్షల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే పథకాన్ని పరిమితం చేసారు. జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లితండ్రులు క్యూ కడుతున్నారు. పనిబాటలో ఉన్న పిల్లలను కూడా బడిబాటలోకి నడిపించేందుకు నిర్దేశించిన అమ్మ ఒడి పథకం ఎన్నో సత్ఫలితాలనిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో ప్రభుత్వ బడుల్లో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు సాగుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్రలో మహిళలను తన తోబుట్టువులుగా భావిస్తూ అన్ననై పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా చూసుకుంటాను అని ఇచ్చిన మాటను అక్షరాలా అమలు చేసి చూపుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రమాణాలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై వేటు ప్రభుత్వ పాఠశాలలకంటే మెరుగైన చదువు ఉంటుందని ఆశించి తల్లి తండ్రులు వేలాది రూపాయిలను ప్రైవేటు పాఠశాలలకు ధారపోస్తున్నారు. శక్తికి మించి ఫీజులు, డొనేషన్లు కడుతున్నారు. అయితే చాలా వరకూ ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యతా ప్రమాణాలు ఉండటం లేదు. ఇరుకు గదులు, అర్హత లేని అధ్యాపకులు, విద్యార్థులపై ఒత్తిడి పెంచే క్లాసులతో అస్తవ్యస్తంగా బడులు నడుపుతున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. విద్యాశాఖా ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోయినా, అధిక ఫీజులు వసూలు చేసినా ఆ స్కూళ్లను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించింది. విద్యార్థులకు వరాలు ప్రతి శనివారం నో బ్యాగ్ డే, అక్షయ పాత్ర ద్వారా రోజూ రుచికరమైన, బలవర్ధకమైన భోజనం, ప్రతి ప్రభుత్వ బడిలోనూ తెలుగుతో పాటు ఇంగ్లీషు మాధ్యమం, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి ఎన్నో అంశాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థులకు చదువు ఉల్లాసంగా, చక్కని వాతావరణంలో లభించేలా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైయస్ జగన్ నేత్రృత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యంగా భావించారు ముఖ్యమంత్రి. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించడం తో పాటు బోధనా సిబ్బందిని తగినంత మందిని ఉండేలా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గత డీఎస్సీలో క్వాలిఫై అయ్యిన అభ్యర్థులను వెంటనే నియమించుకునేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అలాగే త్వరలో మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాల భవనాల పరిస్థితుల మీద తనిఖీలు నిర్వహించి, కొత్త భవనాలు, పాతవాటి మరమత్తులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత దిశగా నడింపించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యాశాఖలో సమూలమైన మార్పులు చేసి విద్యారంగాన్ని ఉన్నత స్థానంలో నిలుపబోతోంది.