అమరావతి: ఆట ఆగిందా నీ సీటు గోవిందా అంటూ పాడుకుంటున్నారు టీడీపీ నేతలు. దేశం పార్టీలో సీట్లు ఆశించే ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. కాంగ్రెస్ లో లాగే ఒక్కో స్థానానికీ ఇద్దరు ముగ్గురు సీట్లు ఆశించే పరిస్థితి. పైగా పక్క పార్టీనించి ఫిరాయించి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో కుతకుతా ఉడికిపోతున్న వాళ్లు అనేకమంది, ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీన్నించి గట్టెక్కేందుకు బాబు నానా కుస్తీలు పడుతున్నాడు. ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రి పదవుల్లోకి వచ్చిన వారిని వరుసగా ఉద్వాసన పలికిస్తున్నాడు. దాంతో ఆశావహులకు ఎమ్మెల్సీలు ఇచ్చైనా బుజ్జగించే ఛాన్స్ ఉంటుందని చంద్రబాబు ఊహ. ఎమ్మెల్సీగా గెలిచి మంత్రైన సోమిరెడ్డి సీటు ఖాళీ చేసి, రాజీనామా సమర్పించగా, అదే తోవలో చాలామంది నడవాల్సివచ్చేలా ఉంది అంటున్నారు. సోమిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కనుక ఎమ్మెల్సీకి రాజీనామా చేసారు.ఇదే పద్ధతిలో మంత్రైన నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామసుబ్బారెడ్డి కూడా పదవికి రాజీనామా చేసారు. ఇదే బాటలో మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, అన్నం సతీష్ ను కూడా తప్పుకోండి అనే సూచనలే కనిపిస్తున్నాయి. మూడు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కనుక వీరు సీటు ఖాళీచేస్తే కొత్తవారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందనేది చంద్రబాబు భావన. శాసన సభ ఎన్నికలకు ఎంతో సమయం లేదు కనుక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అవుతుంది. ఖాళీ అయిన ఈ సీట్ల కేటాయింపులతో అసంతృప్తులకు చెక్ పెట్టాలన్నది చంద్రబాబు ప్లాను. తప్పుకోండి తప్పుకోండి అంతా కొత్తవారికి అవకాశం ఇస్తామంటా అంటున్న బాబును చూసి భయపడుతున్నారు దేశం నేతలు. ఎప్పుడెవ్వరిని తప్పుకోమంటారో అని తలపట్టుకుంటున్నారు.