ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం

మాజీ మంత్రి పేర్ని నాని ఇంటివైపు దూసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం 

రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు గాయాలు 

పుంగనూరులో దళిత, బీసీ నేతలపై దాడి.. హత్యాయత్నం 

విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ​ నేతల ఇళ్లు, దుకాణాల కూల్చివేత

అమ‌రావ‌తి: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో చేపట్టిన అభి­వృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల వద్ద  మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు.  

నూజివీడులో శిలాఫలకం కూల్చివేత 
ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం  చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్‌పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు.   

సచివాలయంపై టీడీపీ జెండా 
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారంభోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్‌ ధ్వంసం చేశారు. సచివాలయం, వైయ‌స్ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు.  
ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సర్పంచ్‌ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్‌ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్‌ఐ చెప్పారు.  

వైయ‌స్ఆర్ పేరు తొలగింపు 
ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్‌ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్‌ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని  బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. 

వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ కన్వీనర్‌ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్‌ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

టీడీపీ అరాచకం!

గ్రామాలు వదిలి వెళ్లాల్సిందిగా మౌఖిక ఆదేశాలు

వైయ‌స్ఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు దక్కాయని తెలుసుకోవడంతోనే తెలుగుతమ్ముళ్లు పేట్రేగిపోయారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పాళ్లు తగ్గుతాయని పరిశీలకులు భావించగా, మరింత ఎక్కువయ్యాయి. గ్రామాలు వదిలివెళ్లాల్సిందిగా కొంతమంది ఆదేశిస్తే, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే చర్యలకు మరికొందరు సిద్ధమయ్యారు. ఈక్రమంలో వ్యక్తిగత ఆస్తులు, వ్యాపార, ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేటేస్తున్నారు. మునుపెన్నడూ లేని దౌర్జన్యకర చరిత్రను లిఖిస్తున్నారు. రాజకీయ వైరి పక్షాలను టార్గెట్‌ చేస్తూ    కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.  

ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఓసారి ప్రజాతీర్పు తప్పదు. ప్రజాభీష్టం మేరకు పాలక పక్షాలు కొలువులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పారీ్టకి ప్రభుత్వ పగ్గాలు దక్కాయి. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా దౌర్జన్యకర ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలో జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం ప్రాంతాల్లో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ప్రైవేటు పాఠశాలలను మూసేయాల్సిందిగా కొందరు ఆదేశిస్తున్నారు. నిర్వాహకులు ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతిచ్చారనే భావనే అందుకు కారణంగా నిలుస్తోంది. కమలాపురం, వల్లూరు, సింహాద్రిపురం ఏరియాల్లో ఇలాంటి వ్యవహారం బహిర్గతమైంది. మరోవైపు అధికారులను ప్రయోగించి వ్యక్తిగత వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. 

గ్రామాలు వదిలి వెళ్లాల్సిందిగా వైయ‌స్ఆర్‌సీపీ మద్దతుదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైరిపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ముద్దనూరు మండల మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి క్రషర్‌ సీజ్‌కు దారితీసినట్లు పలువురు వివరిస్తున్నారు. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో సర్పంచ్‌ శ్రీనివాసులకు చెందిన ప్రవేటు భూమిని ఆక్రమించి, నర్సరీని ట్రాక్టర్లతో మిల్లర్‌ కొట్టారు. కోర్టు పరిధిలో ఉన్న భూమి సైతం స్వా«దీనం చేసుకున్నారు. టీడీపీ వర్గీయులు పట్టపగలు యధేచ్ఛగా ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇలాంటి దౌర్జన్యకర ఘటనలు మునుపెన్నడూ లేకపోగా, ఈమారు క్రమం తప్పకుండా తెరపైకి వస్తుండడం విశేషం.

అధికారులపై కర్రపెత్తనం
అధికారంలోకి వచ్చీ రాగానే తెలుగుదేశాధీశులు కర్రపెత్తనం ఆరంభించారు. మాకు తెలియకుండా చిన్న సంతకం కూడా చేయరాదంటూ మండల స్థాయి అధికారులకు హుకుం జారీ చేశారు. పొజిషన్‌ సరి్టఫికేట్‌ ఇస్తే హౌసింగ్‌ లోన్‌ తెచ్చుకుంటానని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించిన ఓ వ్యక్తికి అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ నేత ఫోన్‌ లేదా సిఫార్సు లేఖ ఏదో ఒకటి కావాలని ఆ అధికారి కోరడం గమనార్హం. గడిచిన ఐదేళ్లు కులాలకు, మతాలకు రాజకీయ పార్టీలకతీతంగా ప్రభుత్వ పాలన అందింది. అయితే నేడు  భిన్నమైన పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది. అధికార యంత్రాంగం సైతం ప్రోత్సహించడం ఆక్షేపణీయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

Back to Top