ప్రస్తుత టీడీపీ రాజధాని ‘ఆందోళన’కు 2015 ‘శంకుస్థాపన’లో మూలాలు!

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై మళ్లీ తెలుగుదేశం రచ్చ మొదలుబెట్టింది. ఎవరిపైనా ఆధారపడకుండా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టలేని నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇప్పుడూ అదే పద్ధతిన నడుస్తోంది. ఉత్తరాంధ్ర అరసవిల్లి సూర్య దేవాలయానికి కాలినడకన బయల్దేరిన అమరావతి రైతులను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టీడీపీ ‘అస్త్రాలు’ ప్రయోగిస్తోంది. అమరావతిలోని రాజధాని ‘పరిపాలనా భవనాల’ను రూ.2000 కోట్లతో పూర్తి చేస్తే అంతా సర్దుకుంటుందని చెబుతోంది తెలుగుదేశం. ఎలాగూ ఇప్పుడు అమరావతి నుంచే అన్ని పాలనా కార్యకలాపాలు సాగుతున్నాయి కాబట్టి ఈ ఒక్క పని చేస్తే చాలు అన్నట్టు చంద్రబాబు గారి పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బతిమాలే ధోరణిలో మాట్లాడుతోంది. నిజానికి, అమరావతిలో స్థానిక రైతులు, ప్రజలు, పరిపాలనా భవనాలు, రాజధాని మౌలిక సౌకర్యాలకు కొత్తగా వచ్చిన ముప్పు ఏమీ లేదు. హైకోర్టు, చట్టసభలు, ఏపీ సచివాలయం, రాజ్‌ భవన్, ఇతర ప్రభుత్వ విభాగాలు మామూలుగా పనిచేస్తున్నాయి. ఇంతటి ప్రశాంత వాతావరణంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు దేని గురించీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. వారికి ప్రభుత్వం నుంచి జరిగే చెల్లింపులూ సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నప్పుడు వారిలో అనుమానాలు, అలజడి అనవసరం.

శంకుస్థాపనకు 7 ఏళ్లు నిండుతున్నా సంక్షోభానికి బాధ్యత చంద్రబాబుది కాదా? 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని హోదాలో విభజిత ఏపీకి పదేళ్లు ఉపయోగపడాలని స్పష్టంగా ఉంది. అయినా, అన్నేళ్లు ఉమ్మడి రాజధానిలో ఎందుకన్నట్టు కొత్త, సొంత రాజధాని నిర్మాణానికి దాదాపు ఏడేళ్ల క్రితమే శంకుస్థాపన చేయించారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. మొదట హైదరాబాద్‌ నగరంలో పదేళ్లు ఉండవచ్చు కదా అనే ధీమాతో ఏపీకి సొంత రాజధాని గురించి వెంటనే ఆలోచించలేదు చంద్రబాబు. తెలంగాణ కౌన్సిల్‌ ఎన్నికల్లో అనవసరంగా వేలు పెట్టి చేయి కాల్చుకున్నారాయన. దీంతో హడావుడిగా అమరావతిలో నిర్మాణం ప్రారంభించారు. ‘అత్యంత ఆధునిక రాజధాని’ కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి సింగపూర్‌ పేరు ఎంత వాడుకున్నా బాబు గారి ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దాదాపు 30 వేలకు పైగా ఎకరాల పంట భూముల సేకరణతో ఇది రాజధాని ప్రాజెక్టులా లేదనీ, ఒక పెద్ద రియల్‌ ఎస్టేట్‌ పథకంలా ఉందని ఏడేళ్ల క్రితమే ఆరోపణలు వెల్లువెత్తాయి. జపాన్‌ వంటి పారిశ్రామిక దేశాల నుంచి పెట్టుబడులు రాబట్టడంలో బుద్ధుడి విగ్రహం, బౌద్ధ మతం పేరు కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ఉపయోగపడలేదు. విభజన చట్టంలో చెప్పినట్టు 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌ సొంత రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి రావాలి. హైదరాబాద్‌ నుంచి అప్పటికి ఏపీ పాలనా వ్యవస్థ వెళ్లిపోవాలి. కానీ, హైదారాబాద్‌లో సెక్రెటేరియట్‌ సహా ఏపీ కార్యాలయాలు అన్నీ కనీసం మూడేళ్లయినా కొనసాగింది లేదు. మరో పక్క అమరావతిలో భారీ పెట్టుబడులతో ‘ప్రపంచ స్థాయి రాజధాని నగరం’ నిర్మాణం ఒక స్థాయికి రాలేదు. విజయవాడ, గుంటూరు వంటి పాత చిన్న నగరాల మధ్య చంద్రబాబు ఉవ్వెత్తున నిర్మించ తలపెట్టిన రాజధాని నగరం కలగానే మిగిలిపోయింది. అంతేగాని అమరావతిలో రాజధాని విధులు ఏవీ ఆగిపోలేదు. ప్రభుత్వ కార్యకలాపాలు చక్కగా సాగిపోతున్న ఈ తరుణంలో తెలుగుదేశం పెట్టాలనుకుంటున్న నిప్పు మంటలు లేవకుండానే ఆరిపోక తప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు 18 మాసాల ముందు తెలుగుదేశం తెరలేపిన నాటకాలను ఆంధ్రులు నమ్మరు. ఎందుకంటే వారు ఇప్పుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని చీకూచింతా లేని పాలనలో ఉన్నారన్న విషయం అందరూ గుర్తిస్తే మంచిది.

Back to Top