కేంద్రం నిజం నిర్ధారించినా..అవే మాయ మాటలు..!

() ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు మాయలు

() నియోజక వర్గాలు
పెరుగుతున్నాయంటూ అబద్దాలు

() 2026 దాకా పునర్
వ్యవస్థీకరణ లేదంటూ కేంద్రం స్పష్టీకరణ

హైదరాబాద్) ప్రతిపక్ష
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రక రకాల మాయలు చేస్తోంది.
త్వరలోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, రాష్ట్రంలో 50 దాకా కొత్త
నియోజక వర్గాలు వచ్చేస్తున్నాయని అబద్దాల్ని ప్రచారం చేస్తోంది. వాస్తవానికి
అటువంటి ఉద్దేశ్యం లేనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా మాయ మాటల్ని
కొనసాగిస్తోంది.

వాస్తవ పరిస్థితి

2006 వ సంవత్సరంలో జనాభా
ప్రాతిపదికన నియోజక వర్గాల్ని పునర్ వ్యవస్థీకరించారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా
ఈ వర్గీకరణ జరిగింది. తర్వాత 2026 లోనే నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగాల్సి
ఉంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందిన నిబంధన. అంతే గాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల
జనాభాను నిర్వచించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నియోజక వర్గాల వర్గీకరణ, కొత్తగా
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు నిర్ధారించటం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అదనంగా నియోజక వర్గాల్ని ఏర్పాటు చేయాలని
నిర్దేశించటం జరిగింది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి అని అందులో
స్పష్టంగా చెప్పటం జరిగింది. అంటే, 2026 దాకా ఆగాల్సిందే. అన్న మాట. లేదంటే
రాజ్యాంగ నిబంధనలతో నిమిత్తం లేకుండా అని రాజ్యాంగ సవరణ చేసి మాత్రమే పునర్
వ్యవస్థీకరణకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్ సభలోనూ,
రాజ్యసభలోనూ పెద్ద ఎత్తున మెజార్టీని కూడగట్టాక మాత్రమే చేయటానికి వీలవుతుంది.

కేంద్రం ఏం చెబుతోంది

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు
ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణకు పెద్దగా ఇష్ట 
పడటం లేదు. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీ కి మెజార్టీ లేదు. అక్కడ
గట్టెక్కాలంటే కాంగ్రెస్ మద్దతు కూడగట్టాలి. అందుకోసం కాంగ్రెస్ నాయకుల్ని బతిమాలాలి.
హస్తం పార్టీ పెట్టే ఇతర షరతుల్ని అంగీకరించాలి. అంతటి రిస్కు తీసుకొన్నా బీజేపీ
కి పెద్దగా వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవు. అటువంటప్పుడు రాజ్యాంగ సవరణ తలకు
ఎత్తుకోవటం ఎందుకని బీజేపీ ఆలోచిస్తోంది. అదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా
స్పష్టం చేస్తోంది. సాక్షాత్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత తోట నర్శింహం
లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంది సదానంద గౌడ సమాధానం
ఇచ్చారు. ఇప్పట్లో నియోజక వర్గాల పెంపు లేదని తెగేసి చెప్పారు.

నాటకాలు మాత్రం కొనసాగింపు

అయినా సరే, చంద్రబాబు
ప్రభుత్వం నిజాల్ని కప్పి పుచ్చేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్ల దాకా
నియోజక వర్గాల పెంపు లేదని తెలిసినప్పటికీ మాయ మాటలు చెబుతోంది. త్వరలోనే 50 కొత్త
నియోజక వర్గాల్ని ఏర్పాటు చేయిస్తామని, కొత్తగా పార్టీలోకి చేరే నాయకులకు వచ్చే
సమస్యే లేదని నమ్మబలుకుతోంది. అందుకే ఇబ్బడి ముబ్బడిగా నాయకుల్ని లాక్కొనేందుకు
కోట్ల రూపాయిల్ని ఎర వేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి టిక్కెట్లకు గిరాకీ
పెంచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. అంతిమంగా కొత్తగా చేరే నాయకులకు మొండి చేయి
చూపించేందుకు అంతర్లీనంగా కుట్రలు సిద్ధం చేస్తోంది. 

Back to Top