పచ్చ నేత..మట్టి మాఫియా




– నందికొట్కూరు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు
– ప్రభుత్వ స్థలాల్లో మట్టిని తవ్వేస్తున్న స్థానిక టీడీపీ నేత
– టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్న అధికారులు
– గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు
 కర్నూలు: దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికార పార్టీ నేతలు మట్టిని తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ అండ, మరోవైపు అధికారుల ఉదాసీనతతో తెలుగు తమ్ముళ్లు అక్రమ సంపాదనలో చెలరేగిపోతున్నారు. నీరు చెట్టు పథకం మాటున మట్టి వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతున్నారు. అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులతో బెదిరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మట్టి దంద యధేచ్చగా కొనసాగుతోంది. డబ్బులు సంపాదించేందుకు టీడీపీ నాయకులు ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో  మట్టిని తవ్వి జేబులు నింపుకుంటున్నారు. నీరు–చెట్టు పథకం పేరుతో ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని బుచ్చిరెడ్డికుంటను టీడీపీ నేత, జెడ్పీటీసీ సభ్యుడు దుష్యంత్‌రెడ్డి తమ ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. కుంటలో మట్టిని తవ్వి నందికొట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో నీరు– చెట్టు పనులకు తరలిస్తూ కోట్లను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా చేపడుతున్న మట్టి తవ్వకాలపై ప్రజా సంఘాలు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి అండదండతో అక్రమ మట్టి దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మట్టి దందాపై ప్రశ్నిస్తే  అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే మట్టి దందాలపై ప్రజా సంఘాలను కలుపుకొని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లోనే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లువ‌నున్నారు.


 
Back to Top