హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని అడ్డుకోవాలని, రాజ్యాంగంలోని మూడవ అధికరణ దుర్వినియోగం కాకుండా నిరోధించాలని, ఏ రాష్ట్రాన్నయినా ఏకపక్షంగా విభజించేందుకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3 సవరణ కోసం మద్దతివ్వాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు నవంబర్ 16 నుంచి ఈ నెల 13 వరకూ దేశ వ్యాప్తంగా పర్యటించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో న్యూఢిల్లీ నుంచి మొదలు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల అధ్యక్షులు, అగ్ర నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, ఆర్టికల్ 3 విషయంలో ఆయా నాయకుల స్పందనలు ఈ విధంగా ఉన్నాయి.
ఏ రాష్ట్ర విభజనకైనా మేం వ్యతిరేకం - సీపీఎం :
‘భాషాప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన ఏ రాష్ట్రం విభజనను అయినా సరే సీపీఎం గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకసారి విభజన ప్రక్రియను ఆరంభిస్తే, తేనెతుట్టెను కదిలించినట్టవుతుందని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. అది మున్ముందు కూడా కొనసాగుతుంది. అసెంబ్లీ, పార్లమెంటు, ఇంకా ఈ అంశం చర్చకు వచ్చే ఇతరత్రా వేదికలన్నింటిపైనా వైయస్ఆర్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ను విభజించవద్దని మేం గట్టిగా కోరతాం.’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి న్యూఢిల్లీలో 16 నవంబర్ 2013న స్పష్టం చేశారు.
ఆర్టికల్-3 దుర్వినియోగంపై పార్టీలో చర్చిస్తాం - సీపీఐ :
‘రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూసే అంశంపై తప్పనిసరిగా మా పార్టీలో చర్చిస్తాం. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుపై మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. పునరాలోచన ప్రసక్తే లేదు.’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి 16 నవంబర్ 2013న న్యూఢిల్లీలో పేర్కొన్నారు.
సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తా - బీజేపీ :
‘ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను మా పార్టీ దృష్టికి తీసుకెళ్తా. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయం. దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తా. మాది చిన్న రాష్ట్రాల విధానం. అయినా ఈ అంశాలను తప్పక పార్టీ దృష్టికి తీసుకెళ్తా.’ అంటూ బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ 17 నవంబర్ 2013 న అన్నారు.
పార్లమెంటులో అడ్డుకుంటాం - టీఎంసీ :
‘ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ను విడదీయాలని చూస్తే లోక్సభ, రాజ్యసభలోనూ అడ్డుకుంటాం.’ అన్నారు కోల్కతాలో 20 నవంబర్ 2013న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ తెలిపారు.
విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం - శివసేన :
‘ఏపీ విభజనను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకుండా సవరించాలి. - ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు (ముంబై, 25 నవంబర్ 2013)
జగన్ లేవనెత్తిన అంశాలు కీలకమైనవి - ఎన్సీపీ :
‘ఎన్సీపీ 9 నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకు వెళ్లరాదని, మూడవ అధికరణ సవరణ విషయాన్ని ప్రస్తావించారు. మా పార్టీ వర్కింగ్ కమిటీలో వీటిపై సీరియస్గా చర్చిస్తాం.’ - శరద్పవార్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత, (ముంబై, 25 నవంబర్ 2013)
ప్రజలను సంప్రదించాల్సింది - బీజేడీ :
‘ఆంధ్రప్రదేశ్ విషయంలో.. విభజన నిర్ణయం తీసుకోవటానికి ముందు రాష్ట్ర ప్రజలను సంప్రదించి ఉండాల్సింది. సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించటం సరికాదు.’ - నవీన్పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి, (భువనేశ్వర్, 24 నవంబర్ 2013)
తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం - ఎస్పీ :
‘చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తాం. ఆర్టికల్-3 ప్రకారమే కాదు.. ఏ విధంగా విభజించినా సమాజ్వాది పార్టీ వ్యతిరేకిస్తుంది.’ అఖిలేష్యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, (లక్నో, 06 డిసెంబర్ 2013)
బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటాం - ములాయం సింగ్ యాదవ్ :
‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును మా పార్టీ పార్లమెంట్లో అడ్డుకుంటుంది’ - ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాది పార్టీ అధినేత (ఢిల్లీ, 9 డిసెంబర్ 2013)
సవరణకు మద్దతిస్తా - జేడీ (ఎస్) :
‘ఆంధ్రప్రదేశ్ను ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం. - దేవెగౌడ, మాజీ ప్రధాని, జేడీ (ఎస్) అధ్యక్షుడు (ఢిల్లీ, 9 డిసెంబర్ 2013)
అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం - జేడీ(యూ) :
‘రాష్ట్రాల అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముంది.’ - నితీశ్కుమార్, బీహార్ ముఖ్యమంత్రి (పాట్నా, 13 డిసెంబర్ 2013)
తీర్మానం తీసుకోవాల్సిందే - బాదల్ :
‘ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకున్నపుడే విభజన అంశాన్ని పరిశీలించాలి.’ - ప్రకాశ్సింగ్ బాదల్, పంజాబ్ సీఎం, (ఢిల్లీ, 13 డిసెంబర్ 013)