కుట్రపూరిత కథనం.. పీటీఐ వంటకం

పెరుగుతున్న ప్రజాబలంతో నానాటికీ అభివృద్ధి చెందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌లో కలుస్తుందని పీటీఐ వండిన వార్త  వెనుక ఎల్లో మీడియా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఆకస్మిక మృతి అనంతరం, పనిగట్టుకుని వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని వేధించి, బయటకు వెళ్ళేలా చేసిన పార్టీలోకి మళ్ళీ చేరడమనేది ఊహాజనితం. పై విషయం తెలిసుంటే పీటీఐ విలేకరి ఇటువంటి వార్తను కచ్చితంగా ఇచ్చి ఉండే వారు. ఇలాంటి వార్తతో వైయస్ఆర్ సీపీని బలహీనపరచాలనే కుట్ర కనిపిస్తోంది. దీనివెనుక ఎల్లో మీడియా కచ్చితంగా ఉండే ఉంటుందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ కథనాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఖండించింది. తమకు ఏ పార్టీతోనూ కలవాల్సిన అవసరం లేదనే సంగతి బాగా తెలుసని కూడా వ్యాఖ్యానించింది. దీనికి ఉప ఎన్నికలలో సాధించిన ఫలితాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. 

రాజకీయంలో బాగా పండిపోయి, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్ఠ ఇనుమడిస్తున్న తరుణంలో డమ్మీలుగా మారిన నేతలు అసత్యాలను ప్రచారం చేయడానికి నడుం బిగిస్తున్నారు. అలాంటి వారు పీటీఐ విలేకరిని ఇందుకు పావుగా వాడుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.  'కాంగ్రెసులో వైయస్ఆర్ సీపీ విలీనమవుతుందా లేక పొత్తు కుదుర్చుకునే  అంశాన్ని తోసిపుచ్చుతారా' అని ఆ విలేకరి వైయస్ విజయమ్మను  ప్రస్తవించినపుడు 'భవిష్యత్తు దానిని నిర్ణయిస్తుందని' ఆమె బదులిచ్చారు.  
కానీ కథనంలో కాంగ్రెసుతో విలీనం అంశాన్ని వైయస్ఆర్ సీపీ తోసిపుచ్చలేదని పేర్కొని, ప్రజలలో పార్టీ పట్ల అనుమానం రేకెత్తించడానికి ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు సక్రమంగా వ్యవహరించాలి. లేనిపోని అపోహలను పాఠకుల మనసుల్లో చొప్పించడానికి ప్రయత్నించకూడదు. పార్టీ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశంలో అటువంటి ప్రయోగం కూడనే కూడదు.  తాను రాసిన కథనాన్ని బలపరచుకోవడానికి కొందరు రాజకీయ నేతల అభిప్రాయాలను కూడా చేర్చారు.  కోట్లాదిమంది ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి చర్యలు విఫలమవుతాయి. అంతేకాక ఇలాంటి చర్యలను ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేసేవిగా భావించక తప్పదు.

Back to Top