జల్సా నాయుడు

సొంత రాష్ట్రంలో విచ్చలవిడి
ఖర్చులు చేసి ప్రజా ధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టే చంద్రబాబు పక్క రాష్ట్రానికి అతిధిగా
వెళ్లి కూడా తన బుద్ధి మార్చుకోలేదు. ఖరీదైన ముఖ్యమంత్రి, ఖర్చుదారు చంద్రబాబు అని దేశమంతా ఆడిపోసుకున్నా
బాబుగారి తీరు మారదు. పోనీలే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మనకోసం సొంత ఉద్యోగులను ప్రచారానికి కూడా పంపినవాడు
అని మిత్ర ధర్మం కొద్ది కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు అతిధిగా
పిలిస్తే నాలుగు గంటల పుణ్యానికి 8 లక్షల పైన చమురు వదిలించాడు. వివిధ రాష్ట్రాల నుంచి
వచ్చిన అనేక మంది అతిధులు ఖర్చు అంతా కలిపినా బాబుగారి సింగిల్ బిల్ లో సగం కూడా తేలలేదు. సమాచార హక్కు చట్టం
ద్వారా తెలుసుకున్న ఈ వివరాలను బెంగుళూరు మిర్రర్ అనే కర్ణాటక పత్రిక బయట పెట్టింది. దాంతో దేశమంతా ఈ విషయం
గురించే చర్చించుకుంటోంది. ప్రాజెక్టులకు, ప్రజల సంక్షేమానికి నిధులు లేవంటూ ఇలా విచ్చలవిడి ఖర్చులు పెట్టడానికి జనాల
సొమ్ము తేరగా వచ్చిందా అంటూ అందరూ ఆడిపోసుకుంటున్నారు. అయినా ఇవన్నీ మన బాబుగారి
తలకెక్కుతాయా ఏంటి ? ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికే హెలికాప్టర్ ఎక్కే మన ముఖ్యమంత్రికి నాలుగు
గంటల హోటల్ రూములో 8 లక్షల ఖర్చు ఓ లెక్కలోనిదా ?

గతంలో సిద్దరామయ్య గాని, యడ్యూరప్ప గాని తమ ప్రమాణ
స్వీకార సమయంలో పిలిచిన అతిధులకు సంబంధించిన ఖర్చులేమి గవర్నమెంటు నుంచి పెట్టించలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ఏర్పాటు
చేసిన కర్ణాటక ప్రభుత్వంలో ప్రజల సొమ్మును జల్సారాయుళ్ల పాలు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేస్తున్న పార్టీలు తాము పిలుచుకున్న అతిధులకు అయ్యే ఖర్చులను పార్టీ తరపునే
భరించాలి. కానీ టీడీపీ లాంటి పార్టీతో
చెట్టాపట్టాలేసుకు తిరిగే పార్టీలు జనం సొమ్ముతో జల్సాలు చేయడం గురించి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బాబుగారితో
తిరుగుతుంటే ఆ బుద్ధులు ఆ మాత్రం అంట కుండా ఉంటాయా ? మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
బాబుగారి జల్సాకి, కర్ణాటక జేబు చిల్లుకి కారణం అయ్యిందన్నమాట. దేశ వ్యాప్తంగా ఖరీదైన
బాబుగారి కధంతా ఇంకోసారి చర్చకు వచ్చింది. 

Back to Top