రాజమండ్రి)) ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏరువాక దున్ని ఖరీఫ్ సాగుని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదే ప్రాంతానికి చెందిన కోనసీమ రైతులు సమావేశమై పంటలు పండించటం తమ వల్ల కాదని, ఈ ఏడాది క్రాప్ హాలీడే పాటిస్తామని వెల్లడించారు. అంటే రైతులు కష్టపడి పంట పండిస్తే లాభాలు దేవుడెరుగు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేనందున, పొలాల్ని బీడులుగా వదిలేయాలని నిర్ధారించారు. చంద్రబాబు చేస్తున్న నిర్వాకంతో అన్నదాతల కడుపు మండటం ఎంతటి బాధాకరం.రైతులకు ప్రధాన అవసరం పెట్టుబడిఆరుగాలం కష్టించే రైతులకు ప్రధానమైన అవసరం పెట్టుబడి. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సాగు చేసుకొనేవారు. లక్ష లోపు రుణాలకు వడ్డీ లేకుండా, 3 లక్షల దాకా పావలా వడ్డీకే వ్యవసాయ రుణాలు అందుతుండేవి. అయితే, రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నమ్మబలకటంతో రైతులు అప్పులు కట్టడం మానేశారు. దీంతో 14 నుంచి 18 శాతం అపరాధ రుసుం పడటంతో పాటు లక్షల మంది రైతుల్ని బ్యాంకులు డిఫాల్టర్లుగా చేసేశాయి. దీంతో బ్యాంకుల నుంచి అప్పు పుట్టేదారి లేకుండా పోయింది. అటు కాల్ మనీ సెక్సు రాకెట్ పుణ్యమా అని వడ్డీ వ్యాపారుల్ని పోలీసులు తీవ్రంగా వేధించటంతో చిన్న చిన్న వ్యాపారులు అప్పు ఇవ్వటం మానేశారు. దీంతో బడా వ్యాపారుల దగ్గర భారీ వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి.సాగునీటి ఇబ్బందులుగోదావరి జిల్లాల్లో ముఖ్యంగ కోనసీమలో వ్యవసాయానికి కాలవల నీరు ప్రధాన వనరు. అయితే గోదావరి నుంచి వచ్చే నీటిని పట్టిసీమ పేరుతో పక్క కు మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకొంది. దీంతో దిగువకు వచ్చే నీరు చాలా వరకు తగ్గిపోతోంది. వచ్చే నీళ్లు కూడా ఎప్పుడు ఇచ్చేది తెలియచేసే వ్యవస్థ అంతకన్నా లేదు. దీనికి తోడు వేసవి కాలంలో కాలవల్లో పూడిక తీత పనులు 2,3 ఏళ్లుగా సాగటం లేదు. దీంతో నీరు పొలాల్లోకి పారకుండా ఎక్కడికక్కడ వ్రధా అయిపోతోంది. పైగా నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లే వెసులు బాటు లేకపోవటంతో ముంపు సమస్య తీవ్రంగా ఉంది. దీని మీద ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ప్రభుత్వం పట్టించుకొనే పరిస్థితి లేదు.నష్టాల బెడదఏ రకంగా చూసుకొన్నా వ్యవసాయం అన్నది కష్టాల కొలిమిలా మారింది. ఇన్ని ఇబ్బందులు పడి సాగు చేసినప్పటికీ, పంటకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు. దీంతో రైతులు సాగుకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. పంట పండించే అన్నదాత ఆకలి దప్పులతో ఉండాలని నిర్ణయించుకొన్నాడంటే ఈ ప్రభుత్వ తీరు గురించి ఏమనుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. పెరిగిన పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం, కొద్దిపాటి వర్షానికే మురుగునీటి కాల్వలు పొంగిపొర్లడం, తీరప్రాంత మండలాల్లో సముద్రం పోటెత్తినప్పుడు చేలను ఉప్పునీరు ముంచెత్తి పంట నష్టపోవడం కోనసీమ రైతులకు పరిపాటిగా మారింది. తీరంలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి తదితర మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేయరాదనే నిర్ణయానికి వచ్చారు. ఇవన్నీ కోనసీమలోని 2,3 పంటలు పండే సారవంతమైన ప్రాంతాలు కావటం గమనార్హం.