ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాల మీద ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళతామని చెప్పారు. తాజాగా గిరిజన మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకొని బాక్సైట్ వ్యవహారం సాగిస్తామన్నారు.ఏజన్సీలో గిరిజనులంతా ముక్తకంఠంతో బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్నారు. గిరిజనులకు అండగా తాము నిలుస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ భరోసా ఇవ్వటంతో పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టారు. వైఎస్ జగన్ చింతపల్లి సభలో ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం తామేమీ తీర్మానలుచేయలేదని, ఈ తవ్వకాల్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ఇంత విస్పష్టంగా చెప్పినా ముందుకు ఎలా వెళతారు అనే అనుమానం కలుగుతుంది. కానీ, చంద్రబాబు ఇక్కడే తన తెలివితేటలు ఉపయోగించారు. బాక్సైట్ తవ్వకాల మీద గిరిజనులు ఆన్ లైన్ లో అభిప్రాయాలు తెలపాలని ఒక ఆన్ లైన్ పోర్టల్ తెరిచారు. ఇందుకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. బాక్సైట్ తవ్వుతామంటున్న గ్రామాల్లో ఇంటర్ నెట్ ఊసే లేదు. అక్కడ కరెంట్ ఉండటమే గొప్ప. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేనే లేవు. అటువంటప్పుడు గిరిజనుల అభిప్రాయాలు ఆన్ లైన్ లో సేకరించటం అంటే ప్రభుత్వం ఏం చేయబోతోందో అర్థం అవుతోంది. ఈ వంకన గిరిజనుల్ని బలి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట వినిపిస్తోంది. అందుకే ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళతామనే కొత్త నాటకాన్ని ఆడుతున్నారని చెబుతున్నారు.