చంద్రబాబే కాదు... సీఎమ్మూ అబద్దాల కోరే!

ఎమ్మిగనూరు:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలపై శనివారం నిప్పులు కురిపించారు. కర్నూలు జిల్లాలో పదో రోజు యాత్రలో ఆమె ఇరువురిపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. కె. తిమ్మాపురానికి వెళ్లగానే గ్రామ ప్రజలంతా ఊరి చావిడి వద్ద గుమిగూడి షర్మిలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలంతా తమకు పింఛన్లు రావడం లేదని, ఉన్న పింఛన్లు కూడా ఎత్తేస్తున్నారని వెల్లడించారు. మహిళా గ్రూపుల కింద అప్పు తీసుకుంటే రూ.3 వడ్డీ వంతున వసూలు చేస్తున్నారని స్థానిక పరిస్థితిని వివరించారు. దీంతో షర్మిల ‘ సీఎం వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెపుతున్నారు కదక్కా!’ అని ప్రశ్నించడంతో అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. దాంతో ఆమె ‘ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికే అబద్దాలు చెప్పే అలవాటు ఉందనుకొన్నాను.

     కానీ కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా అబద్ధాలు దండిగానే చెప్పే అలవాటు ఉందన్నమాట’ అని వ్యాఖ్యానించారు. వారితో పాటు రైతులు కూడా కరెంటు, నీటి కష్టాలను చెప్పుకోగా... ‘ ఈ ప్రభుత్వం పట్ల మీకు విశ్వాసం ఉందా?’ అని ప్రశ్నించడంతో ‘లేదు... లేదు’ అంటూ సమాధానం చెప్పారు. దీంతో షర్మిల స్పందిస్తూ... ‘ ప్రజలకు విశ్వాసం లేకపోయినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు మాత్రం కిరణ్ ప్రభుత్వంపై విశ్వాసం ఉందంట. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదు’ అని చెపుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, జగన్‌ను ప్రజలకు దూరం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలకు వివరించారు.

పెద్ద పెద్ద చదువులు చదవాలి...

     కె. తిమ్మాపురంలో మధ్యాహ్న భోజనాల తరువాత పాదయాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆమెకు స్వాగతం పలకడంతో పాటు తమ సమస్యలు వివరించారు. 250 మంది విద్యార్థులకు ముగ్గురే రెగ్యులర్ టీచర్లు ఉన్నారని, విద్యావలంటీర్లను కూడా ఆగస్టులో గానీ నియమించలేదని వారు చెప్పారు. నవంబర్ నెల వచ్చినా ఇప్పటి వరకు యూనిఫారాలు లేవని, బాత్‌రూంలు సరిగా లేవని తమ బాధలు వెల్లడించారు. దీంతో షర్మిల టీచర్ గా మారి విద్యార్థులకు బుద్ధులు చెప్పారు. ‘తరతరాల వెనుకబాటుకు చదువే శాశ్వత పరిష్కారం. పిల్లలంతా శ్రద్ధగా మనసు పెట్టి చదువుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీలతో చదువు ఆపకుండా పెద్ద చదువులు చదవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి. మరో ఏడాది గడిస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అప్పటి వరకు అధైర్యపడొద్దమ్మా! ’ అని బుజ్జగించారు.

     అనంతరం గార్లదిన్నెలో కూలీలు, రైతులతో మాట్లాడి వారి బాధలు విన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తికాక కాలువలకు నీరు రాక పడుతున్న కష్టాలు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలదే ఈ పాపం అని ఆమె వివరిస్తూ... గురు రాఘవేంద్ర ప్రాజెక్టును ప్రారంభించి పనులు పూర్తిచేస్తే ఎత్తిపోతలకు మోటార్లు బిగించలేని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం దైవందిన్నె వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు.

     శనివారం నాటి పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవ రెడ్డి, మాజీ మంత్రి కొణతల రామకృష్ణ , అధికార ప్రతినిధి వాసిరెడ్డి, కాపు భారతి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ ఇన్‌చార్జిలు ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి, బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ మధుసూదన్, ఎం.ఎల్. కాంతారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, అత్తిరి గౌడ్, మహేందర్ రెడ్డి, విరుపాక్షప్ప, శ్రీనివాస్ రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top