ఆశ చావని చంద్రబాబు ఆఖరి పోరాటం!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర పరిపాలన అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోవాలన్న ఆశ చావలేదు. అందుకే ఆయన కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. సరికొత్త పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే, చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వాటిని తెలుసుకుంటున్నారు. బాబు భావిస్తున్నట్లు ప్రజలు అమాయకులు ఎంతమాత్రమూ కారు. ఆ విషయాన్ని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే గ్రహించలేకపోవడం విచిత్రం.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు, కడప లో‌క్‌సభ సభ్యుడు, అత్యంత ప్రజాదరణ గల యువకెరటం జగన్మోహనరెడ్డి ధాటికి తట్టుకోవడం కష్టం అని చంద్రబాబుకు ఇప్పటికే తెలిసివచ్చినట్లుంది. జగన్ పట్ల వెల్లువెత్తిన ప్రజాభిమానంతో‌ ఆయన దిమ్మతిరిగిపోతోంది. 2010 డిసెంబర్లో జగ‌న్మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైయస్‌ఆర్‌ సిపియే  ఘన విజయం సాధిస్తోంది. ఏ సర్వే జరిగినా ఆ పార్టీయే ముందంజలో ఉంటోంది.

ఇటీవలే ఎన్‌డీటీవీ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో 48 శాతం మంది మద్దతు పలికారు. చంద్రబాబు పట్ల కేవలం 18 శాతం మంది, కేసీఆర్‌కు అనుకూలంగా 17 శాతం మంది, సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వైపున 11 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులలో చంద్రబాబు చివరి ప్రయత్నంగా మరో కొత్త ఎత్తు వేశారు. 'వస్తున్నా.. మీకోసం' అనే పేరుతో అక్టోబర్ 2 నుంచి జనవరి 26 వరకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. వై‌యస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిని 'బాబు ఆఖరిపోరాటం' అని ‌అభివర్ణించారు. 

చంద్రబాబు వేసే ప్రతి ఎత్తును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిస్సిగ్గుగా ఆయన వేసే వేషాలన్నీ స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఆయనకు అధికారంపై ధ్యాస తప్ప, ప్రజా సమస్యల పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయింది. ఆయన వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిమానం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఆ విషయం ఇటీవలి ఉప ఎన్నికలలో కూడా జనం స్పష్టంగా వెల్లడించారు.
 
అధికారంలో ఉండగా ఆయన వ్యవసాయం, రైతుల పట్ల వ్యవహరించిన తీరుతోనే ప్రజలకు ఆయనపై సగం గౌరవం తగ్గింది. ఆ తరువాత మహానేత డాక్ట‌ర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్ష నేతగా నిలవలేకపోయారు. ఆ మహానేత దుర్మరణం చెందిన తరువాత జగ‌న్ పట్ల ఉప్పెనలా పెరుగుతున్న ప్రజాభిమానాన్ని ఎదుర్కోవడం కోసం ఆయన కాంగ్రె‌న్ పార్టీతో కుమ్మక్కవడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. దానికి‌ తోడు ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా ఉండవలసిన సమయంలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడటంతో ఉన్న కాస్త గౌరవం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేసినా, ఏం చెప్పినా జనం నమ్మే స్థితి లేదు. 

ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరించే సమయంలో, కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో బలం తగ్గినప్పుడు, అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఉన్న సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టలేదు. మాజీ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడటానికి రెండు రోజుల ముందు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి. హోంమంత్రి చిదంబరంని రహస్యంగా కలిశారు. ఎమ్మా‌ర్ ప్రాపర్టీ‌స్‌ కేసులో తన జోలికి రావద్దని ఆయన రహస్యంగా కోరినట్లు గుసగులు వినిపించాయి. అందుకు ప్రతిగా రాష్ట్రంలో ప్రభుత్వానికి తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి.

వైయస్‌ఆర్‌ అంటే నిలువెల్లా అభిమానం నింపుకున్న ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తరువాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రె‌స్‌ - టీడీపీ కుమ్మక్కును తారా స్థాయిలో కళ్లకు కట్టిన ఘట్టం ఉప ఎన్నికలు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయేంతగా కిందికి దిగజారిపోయారు. టిడిపి అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో కేవలం 6,256 ఓట్లు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 8,813 ఓట్లు మాత్రమే వచ్చాయి. టిడిపికి పోలైన ఈ ఓట్లతో కుమ్మక్కు విషయం తేటతెల్లమయింది.

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు స్పష్టంగా తెలియడంతో జనం అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్తో ఏకాంతంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రె‌స్ ప్రభుత్వం తీవ్ర‌ సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పీఎంతో జరిపిన రహస్య సమావేశం పలు అనుమానాలకు దారి తీసింది. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయం మొన్న శాసనసభ సమావేశాలలో టిడిపి సభ్యులు ప్రవర్తించిన తీరుతో పూర్తిగా అర్థమైంది. ప్రజలు, మిగిలిన విపక్షాల నేతలు దుమ్మెత్తి పోశారు. 

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి లభిస్తున్న ప్రజా‌దరణను చూసి, ఆ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ కొట్టడానికి అధికార దాహంతో చంద్రబాబు అలవాటుపడిపోయారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏం చేస్తే అది చేయడం మొదలు పెట్టారు. వారు ధర్నా చేస్తే ధర్నా, దీక్ష చేస్తే దీక్ష చేశారు. ప్రజలు స్పందించలేదు. ఆయన వేషాలు వారికి అర్ధమైపోయాయి. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వారు తప్పనిసరిగా స్పందిస్తారు. కానీ ఆయన కాపీ వేషాలు వారికి అర్ధం కావడంతో ఫలితం దక్కలేదు.

ఈ పరిస్థితులలో ఇప్పుడు చివరి ప్రయత్నంగా మరో కాపీ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాక ముందు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, నేరుగా ప్రజలను కలుసుకునేందుకు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాగే పాదయాత్ర చేసి ప్రజాభిమానాన్ని కొల్లగొట్టవచ్చని చంద్రబాబు భ్రమపడుతున్నారు. ‌తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు ప్రజల సమస్యలు, వారి కష్టాలు తెలియవా?

అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అని, సబ్సిడీల వల్ల లాభం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాలే ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. దాంతో రాష్ట్ర ప్రజలు ఆయనను అధికారంలో నుంచి లాగిపడేశారు. తన పాలనను ప్రజలకు గుర్తు చేయడానికి, వారిని చైతన్యపరచడానికి పాదయాత్ర చేయనున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. తన పాలనని తనే గుర్తు చేయవలసివచ్చిందంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతుల పట్ల ఆయన వ్యవహరించిన తీరు గుర్తుకు వస్తే ప్రజలు నిరసనలు తెలిపే ప్రమాదం కూడా ఉంది.

మహానేత డాక్టర్ వైయస్‌ మరణించినా ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఫీజు రీయింబ‌ర్స్మెంట్ ‌లాంటి పలు పథకాలు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయాయి. ఎందుకంటే వాటి ఫలితాలను వారు పొందారు. పాలనంటే అది. అటువంటి పాలనను ప్రజలకు మరొకరు గుర్తుచేయవలసిన అవసరం ఉండదు.

ప్రజలు నిజాయితీపరులు. మహానేత ప్రవేశపెట్టి అమలుచేసిన పథకాలను నిరంతరమూ గుర్తుంచుకుంటారు. ఇక చైతన్యం విషయానికి వస్తే ఉప ఎన్నికలలో ప్రజలు తమ చైతన్యం చూపించి చంద్రబాబును, ఆయన పార్టీని మట్టికరిపించిన వైనం మనకు తెలియనిది కాదు. 

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయారు. పూర్తిగా విఫలమయ్యారు. ఆయన రాజకీయ ఎత్తుగడలు ప్రజలకే కాదు, తమ నేతలకు కూడా రుచించలేదు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబం పట్ల ఆయన వ్యవ‌హరిస్తున్న తీరు కూడా పార్టీ నేతలకు నచ్చడంలేదు. పలువురు ఎమ్మెల్యేలు, అధిక సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చివరి ఎత్తుగడగా 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఫలించే అవకాశాలు ఏ కోశానా కనిపించడంలేదు.
Back to Top