మీ సంతోషంలో భాగమవుతా..

ఓర్వకల్లు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పాదయాత్రలో మీ అందరి గుండె చప్పుడు విన్నా

మీ కష్టాలు చూశాను..మీ మాటలు విన్నాను

ప్రతి మనిషికి మంచి జరిగేలా పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాం

ప్రతి ఒక్క కుటుంబానికి నేనున్నానే భరోసా ఇస్తున్నా

ఈ ఐదేళ్లలో రైతులు తీవ్రంగా బాధపడ్డారు

అప్పులు మాఫీ కాలేదన్న బాధ డ్వాక్రా మహిళల్లో చూశా

బెల్టు షాపులు రద్దు చేస్తామన్న మాట నెరవేరలేదు

ఆరోగ్యశ్రీ సరిగ్గా అందక అవస్థలు పడుతున్న పేదల కష్టాలు చూశా

ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఓట్లు తీసేస్తారు..హత్యా రాజకీయాలకు తెర

మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు..అమ్ముడపోయిన మీడియాతో కూడా పోరాటం

ఓటుకు రూ.3 వేలు ఇచ్చే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబుది

అన్న ముఖ్యమంత్రి అవుతారు..మన పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు

కర్నూలు: మీ సంతోషంలో భాగమవుతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాటిచ్చారు. ఓదార్పు యాత్ర నుంచి ప్రజాసంకల్ప యాత్ర వరకు మీ ఆవేదన..మీ అందరి గుండె చప్పుడు విన్నానని, మీ అందరికీ నేనున్నానని ఆయన భరోసా కల్పించారు. ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మేలు చేయాలనుకుంటారని, ఇటువంటి పాలన వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిందన్నారు.  ఈ ఐదేళ్లలో ఎలాంటి సాయం జరుగలేదన్నారు. చంద్రబాబు ఓటుకు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, అన్న ముఖ్యమంత్రి అవుతారని అందరికి చెప్పండి..అంటూ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

మండుతున్న ఎండ అయినా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఈ ఎండలు ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓర్వకల్లు ప్రజలందరికీ మీ అందరూ బాగుండాలని, మీ బాగోగుల్లో నేను భాగం కావాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ సంతోషంలో భాగం కావాలని, రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ఆ పాదయాత్ర చేసినప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నాను ఆ పాదయాత్రలో రాష్ట్రం నలుమూలల తిరిగాను. రాష్ట్రం నలుమూలలో ప్రజలు ఎలా ఉన్నారు. వారి కష్టాలు ఏంటీ తెలుసుకున్నాను. విన్నాను. నేనున్నాను అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో నాలుగు ఐదు రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్‌ చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా.. ఏ సగటు మనిషి ఏం కోరుకుంటుందని ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు రెండు ప్రశ్నల మీద సమాధానం కోసం వెతికాను. 

మనిషికి మనస్సు ఉంటే తెలుగువారికి సాయం చేయాలనుకుంటాడు. కానీ ఒక ప్రభుత్వానికి మనస్సు ఉంటే ఇంటింటికి మేలు చేయాలని అనుకుంటుంది. మనిషి మనిషికి మేలు చేయాలనుకుంటుంది. ఇటువంటి పాలన నాన్నగారి పాలనతోనే వెళ్లిపోయింది. ఒక గ్రామమే తీసుకుంటే, ఒక కుటుంబమే తీసుకుంటే ఆ గ్రామం ఎలా బాగుపడాలి. ఆ కుటుంబం ఎలా బాగుపడాలి. బాగుపడేందుకు ప్రభుత్వంగా మనమేం చేయాలనే పరిస్థితి ఈ ఐదేళ్లలో కనిపించలేదు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటిని గ్రామాల్లో ఉన్న పరిస్థితులను, మీ ఆవేదనలు విన్నాను. బాధలు నేను చూశాను. నేనున్నానని మరోసారి భరోసా ఇస్తున్నాను. ఓ రైతు కుటుంబాన్నే తీసుకుంటే ఆ రైతు ఏం కోరుకుంటారు. వ్యవసాయం బాగా జరగాలని, గిట్టుబాటు ధర అందాలని రైతు కుటుంబం ఆలోచిస్తుంది. తన ఖర్చులు తగ్గించాలని ఆరాటపడే ప్రభుత్వం కోసం ఎదురుచూస్తుంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం కోసం ఎదురుచూస్తుంది. కానీ ఐదేళ్లలో పాదయాత్రలో చూసిందేమిటంటే ఈ రెండు అందక రైతు పడుతున్న ఆవేదన, బాధను చూశాను. ఆ బాధ అంతాఇంతా కాదు. ప్రతి రైతుకు భరోసా ఇస్తూ చెబుతున్నాను. మీ బాధలు చూశాను. కష్టాలు విన్నాను. నేను ఉన్నానని కచ్చితంగా చెబుతున్నాను. 

మన రాష్ట్రంలో 50 శాతానికి పైగా జనాభా అక్కచెల్లెమ్మలే. ఆ అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందని పాదయాత్రలో చూశాను. దాదాపు 93 లక్షల కుటుంబాలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందని నా కళ్లతో నేను చూశా. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం బాగుంటుంది. పాదయాత్రలో అక్కచెల్లెమ్మల కష్టాలు చూశా. అప్పులు మాఫీ కాలేదు. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయాయి. సున్నా వడ్డీలు కనుమరుగైపోయాయి. ఆ అక్కచెల్లెమ్మల బాధలు చూశా. వారి ఆవేదన విన్నా. వారికి నేను చెబుతున్నా మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నానని, అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెబుతున్నా. గ్రామాల్లో ఆడపిల్లలకు, మహిళలకు భద్రత ఉంటుందనుకుంటూనే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుంది. ఆడపిల్లలు ఇల్లు దాటితే తిరిగి క్షేమంగా వస్తారనే నమ్మకం ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. పాదయాత్రలో గమనించా.. గ్రామాల్లో మందు అమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. చివరకు చిల్లర దుకాణాల్లో మందు అమ్మే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెల్టుషాపులు రద్దు హామీ అలాగే మిగిలిపోయింది. ప్రతి గ్రామంలో ఒకటి కాదు. నాలుగు ఐదు బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. చీకటి పడితే రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి. అక్కచెల్లెమ్మలకు చెబుతున్నా.. మీ కష్టాలు నేను విన్నాను. నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా. 

పాదయాత్రలో చూసిన కొన్ని సంఘటనలు ఫీజులు కట్టలేని పరిస్థితి. పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి గొప్ప చదువులు చదువుతున్న పిల్లలకు ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు చేయలేని పరిస్థితి ఉంటే కొంత మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాను పాదయాత్రలో. ఆ తల్లిదండ్రులు, పిల్లల కోసం చెబుతున్నా.. మీ కష్టాలు చూశా.. మీ బాధలు విన్నా.. అందరికీ చెబుతున్నా నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా.. 

పాదయాత్రలో చాలా చూశా.. ఉద్యోగాల కోసం వెతుకుతున్న పిల్లలను చూశా. నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న పిల్లలను చూశా. రాష్ట్రం విడిపోయేటప్పుడు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఉన్నారన్నా.. ఎక్కడున్నాయన్నా.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఎందుకన్నా ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదు. ఎందుకన్నా మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని అడిగిన పిల్లలను చూశా. చంద్రబాబు ప్రభుత్వం గురించి చెప్పిన మాటలు విన్నా.. ఎన్నికలప్పుడు బాబు ఉద్యోగం కచ్చితంగా ఇస్తా.. ఉపాధి కచ్చితంగా ఇస్తా.. ఈ రెండు ఇవ్వలేకపోతే ప్రతి నెల రూ. 2 వేల భృతి ఇస్తానన్న మాటలు ఏమయ్యాయన్నా అని చెప్పి అడిగిన పిల్లలను చూశా. చదువులు అయిపోయి ఉద్యోగాలు కోసం చూస్తున్న ప్రతి పిల్లలకు చెబుతున్నా మీ కష్టాలు చూశా. మీ బాధలు విన్నా.. నేనున్నానని గట్టిగా భరోసా ఇస్తున్నా. 

ఆరోగ్యశ్రీలో జబ్బులు కాకపోవడం చూశా. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయకపోవడం చూశా. ఒక మనిషి చనిపోతే కుటుంబం దెబ్బతినిపోవడం చూశా. 108 సకాలంలో రాక ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూశా. కుయ్‌ కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌లు రాక, ఆరోగ్యశ్రీ వర్తించక పూర్తిగా అస్వస్థత పాలై పెరాలసిస్‌ వచ్చి కుర్చీకే పరిమితం అయిపోయి జీవితాన్ని ముందుకు గడపలేక చావు కోసం ఎదురుచూస్తున్న ప్రతి పేదవాడి కుటుంబాన్ని చూశాను. ఆ పేదవాడికి చెబుతున్నాను. మీ కష్టాలు విన్నా.. మీ బాధలు చూశాను. మీ అందరికీ చెబుతున్నా నేను ఉన్నానని భరోసా ఇస్తున్నా. 

బాబు హయాంలో పెన్షన్‌ మూడు నెలల ముందు పెరుగుతుంది. ఐదు సంవత్సరాల పాలనలో 57 నెలల పాలనలో పెన్షన్‌ పెంచాలని అవ్వాతాతలకు తోడుగా ఉండాలనే ఆలోచన రాదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి అప్పుడు అవ్వాతాతలు గుర్తుకువస్తారు. పెన్షన్‌ పెరుగుతుంది. అవ్వాతాతలు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఐదేళ్లలో పడిన కష్టాలు చూశా. పెన్షన్‌ కావాలంటే జన్మభూమి కమిటీలు అడిగే ప్రశ్నలు ఏంటో నేను విన్నా.. ఏ పార్టీ వారు మీరు అని అడిగే ప్రశ్నలు విన్నా. పెన్షన్‌ కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెబుతున్నా. మీ కష్టాలు విన్నా. మీ కష్టాలను నేను చూశా.. నేను ఉన్నానని మీ అందరికీ కచ్చితంగా చెబుతున్నా. నేను విన్నాను.. నేను ఉన్నాను. ఆ మహానేత దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఏ రకంగా ప్రతి గుండె చప్పుడులో ఎలా బతికి ఉన్నారో అంతకంటే మంచి పాలన అందించేందుకు నేనున్నానని కచ్చితంగా చెబుతున్నా. ఇటువంటి అన్యాయమైన పాలన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చూస్తున్నా. ఇటువంటి అన్యాయమైన, మోసపూరితమైన పాలన చేస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లు అడిగితే ప్రజలు ఓట్లు వేయరని తెలిసి ఎలాగైనా గెలవాలని చేస్తున్న మోసాలను, అన్యాయాలను చూస్తున్నాం. గెలవడం కోసం ఏ అన్యాయం అయినా చేయడానికి వెనుకడుగు వేయని చంద్రబాబు మనస్తత్వాన్ని చూస్తున్నాం. ప్రజల ఓట్లను తొలగిస్తాడు. దొంగ ఓట్లను ఎక్కిస్తాడు. ప్రజల ఆధార్, బ్యాంక్‌ అకౌంట్లను చోరీ చేస్తాడు. చివరకు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల ఫోన్‌ నంబర్లను జన్మభూమి కమిటీలకు, సేవా మిత్ర సభ్యులకు ఇచ్చే సంస్కారం లేని పనులు చేస్తున్నాడు. చివరకు ఎన్నికల్లో గెలవడం కోసం బలమైన ప్రత్యర్థులను ఎలా నీరుగార్చాలని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఏకంగా హత్యా రాజకీయాలకు కూడా తెరతీస్తున్నారు. ఈ పెద్దమనిషే ఇన్ని అన్యాయాలు చేస్తున్నాడు. గజదొంగ, బందిపోటులా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇన్ని అన్యాయాలు చేసి ఎదుటివారిపై నెపం నెడుతున్నాడు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉంది. మీ అందరికీ చెబుతున్నా.. మరో 20 రోజుల్లో ఇటువంటి కట్టుకథలు చాలా కనిపిస్తాయి. అన్యాయమైన సినిమాలు ఇంకా చాలా చాలా చూపిస్తారు. మనం పోరాడుతుంది చంద్రబాబు ఒక్కరితోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పోరాటం చేస్తున్నాం. ఇంకా ఇటువంటి అమ్ముడుపోయిన టీవీ ఛానళ్లతో పోరాడుతున్నాం. వీళ్లంతా 20 రోజుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా విపరీతంగా ప్రచారం చేసే పరిస్థితుల మధ్య పోరాటం చేస్తున్నాం. మీ అందరినీ కోరేది ఒక్కటే.. రాబోయే రోజుల్లో చంద్రబాబు అన్యాయాలు ఇంతటితో ఆగిపోవు. గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ఓటుకు రూ. 3 వేలు ప్రతి చేతిలో పెట్టే ఆలోచన చేస్తాడు చంద్రబాబూ. మీ అందరినీ కోరేది ఒక్కటే.. మీ గ్రామాలకు వెళ్లాలి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా అన్న ముఖ్యమంత్రి అవుతాడు. తరువాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాడు అన్న అని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. 

మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్లు చదవాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి 20 రోజులు ఓపిక పట్టు అక్క చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లల చదువుల ఖర్చులు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. ఎన్ని లక్షలు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. 

గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు చెప్పాలి. ఐదేళ్లు చంద్రబాబును నమ్మి మోసపోయాం. గత ఎన్నికల్లో ఓటేసిన తరువాత ఐదేళ్లు చూశాం. రుణమాఫీ అని మోసం చేసిన పరిస్థితులు చూశాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అన్న 20 రోజులు ఓపిక పట్టు అన్న రేపు పొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పెట్టుబడుల కోసం మే మాసం వచ్చే సరికి సంవత్సరానికి రూ. 12,500లు అన్న చేతులో పెడతాడని చెప్పాలి. పంటలు పడుతున్నాయి. ఉల్లిపంట వేశాం గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేస్తున్నాం. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. అన్నకు అవకాశం ఇచ్చిన తరువాత గిట్టుబాటు ధర కల్పిస్తూ గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి. 

ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్క రేపు పొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం కూడా నాలుగు దఫాల్లో నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. బ్యాంకుల్లోకి సగర్వంగా వెళ్లే రోజులు వస్తాయి. బ్యాంకుల్లో సున్నా వడ్డీకే డబ్బులు ఇచ్చే రోజులు వస్తాయి. అక్కాచెల్లెమ్మలు లక్షాధికారులు రోజులు దగ్గరలోనే ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోద్దని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. 

ప్రతి అవ్వకు, ప్రతి తాతను ఒకే ఒక్కటి అడగండి. ఎన్నికలకు మూడు నెలల క్రితం పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి. కొందరు రావడం లేదని, మరికొందరు వెయ్యి అని చెబుతారు. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు అని చెప్పకపోయి ఉంటే ఈ బాబు ఇచ్చేవాడా అని అవ్వాతాతలను అడగండి. ఆ అవ్వాతాతలకు చెప్పండి చంద్రబాబు చెప్పే మాటలకు మరోసారి మోసపోవద్దు. జగన్‌ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. 20 రోజులు ఓపిక పట్టండి ఆ తరువాత అన్న ప్రతి అవ్వాతాతకు పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశం ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు చేరాలి. అప్పుడు చంద్రబాబు మోసాన్ని ఆపగలుగుతాం. మీ ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దీవెనలు రాంభూపాల్‌రెడ్డి అన్నకు అందించాలని, అలాగే ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు కోరుతూ బ్రహ్మానందరెడ్డి అన్న కూడా నిలబడుతున్నాడు. మీ దీవెనలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఉండాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. 

 

తాజా వీడియోలు

Back to Top