సెప్టెంబర్‌ 2 నుంచి షర్మిల బస్సుయాత్ర

హైదరాబాద్, 29 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో బస్సుయాత్ర ప్రారంభిస్తున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో వైయస్ఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె బస్సుయాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే
రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో ఆమె బస్సు యాత్ర చేయనున్నారు.
సీమాంధ్ర జిల్లాలలో ఆమె బస్సు యాత్ర కొనసాగుతుంది.

రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టిచుకోని అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో అంట కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సుమారు నెల రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 230 రోజుల్లో 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మరో సారి ఆమె రాష్ట్ర ప్రజల కోసం బస్సుయాత్రను తలపెట్టారు.

Back to Top