చీరాల: చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ విమర్శించారు. వేటపాలెం మండలం వేటపాలెం గ్రామ పంచాయతీలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారి సమస్యలను యడం బాలాజీతో చెప్పుకున్నారు. అర్హులైన వారికి ఫించన్లు అందడం లేదని, రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మొరపెట్టుకున్నారు. అనంతరం యడం బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల ముందుకు వందలకొద్ది హామీలను గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఓటేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చాలని పోరాటం చేస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నాడన్నారు. బాబు చేతిలో మోసపోయిన బాధితులు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సస్యశ్యామలవుతోందన్నారు. చంద్రబాబు మోసాలపై ముద్రించిన ప్రజాబ్యాలెట్ను ఇంటింటికి పంచి ప్రజలతో బాబు పాలనకు మార్కులు వేయించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మండల అధ్యక్షులు కొలుకుల వెంకటేష్, మైనార్టీ నాయకులు నూరుల్లా, సమృద్ధి, ప్రదీప్, సన్నీ, భాను. శారదాంబ తదితరులు పాల్గొన్నారు. <br/>