<strong>ఇప్పటికీ.. ఎప్పటికీ వ్యవసాయమే దండగనే వ్యక్తి చంద్రబాబు</strong><strong>ఏరువాక సాక్షిగా పచ్చి అబద్ధాలు</strong><strong>ఎంపీల వీడియోతో టీడీపీ చిత్తశుద్ధి బయటపడింది</strong><strong>డైటింగ్ ప్రోగ్రాంలా రమేష్నాయుడు నిరాహార దీక్ష</strong><strong>జేసీ బూతులు మాట్లాడినా ఎందుకు చర్యలు తీసుకోలేదు</strong><strong>ప్రజల్లో జోకర్గా మిగిలిపోతున్న చంద్రబాబు</strong><strong>తప్పుడు కేసుల్లోంచి కడిగిన ముత్యంలా వైయస్ జగన్ వస్తారు</strong>హైదరాబాద్: చంద్రబాబు పాలనలో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్లోకి వెళ్లిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏరువాక సాక్షిగా చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. అసలు వ్యవసాయమే దండగ అనే వ్యక్తి ఏరువాక కార్యక్రమం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరువాక కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ఆర్ సీపీని విమర్శించడానికే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వ్యవసాయం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా వైయస్ జగన్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. <br/>ఇప్పటి వరకు ఆంధ్రరాష్ట్ర పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో వ్యవసాయం దండగ అనే వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని, అది ఇప్పటికీ.. ఎప్పటికీ అన్నారు. ఐటీ, రోడ్లులో కమీషన్లు వస్తాయి.. వ్యవసాయంలో రావనే కుట్రతోనే అశ్రద్ధ చూపుతున్నాడన్నారు. ఏరువాక సాక్షిగా చంద్రబాబు అముదాలవలసలో పచ్చి అబద్ధాలు అడారని అంబటి అన్నారు. నాలుగేళ్లుగా రైతులకు భరోసాగా ఉన్నాం. బ్రహ్మాండంగా మేలు చేశాం.. రూ. 87 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని అవలీలగా అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. రూ. 13 వేల కోట్లు ఇచ్చి రుణమాఫీ మొత్తం చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయరంగంలో గ్రోత్రేట్ బ్రాహ్మాండంగా సాధించామని అబద్ధాలు చెప్పారన్నారు. కేవలం వ్యవసాయరంగ వృద్ధిరేటు చూస్తే 2014–15లో –.35, అదే విధంగా 2015–16లో –13.16, 2016–17లో –7.01లో ఉందన్నారు. మూడు సంవత్సరాల పాటు మైనస్లో ఉంటే.. వ్యవసాయ అనుబంధ రంగాలను కలుపుకొని దొంగ లెక్కలు తీసుకొచ్చి అద్బుతంగా జరిగిందని చెబుతున్నాడన్నారు. కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేసేందుకు పెద్ద ఈవెంట్ నిర్వహించాడని, ఎన్నికల ముందు తన వైఫల్యాలను మసిపూసి మారేడుకాయ చేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. <br/>ఉక్కు పరిశ్రమ సాధనలో టీడీపీ చిత్తశుద్ధి నిన్న ఢిల్లీలో బయటపడిందని అంబటి అన్నారు. టీడీపీ ఎంపీలంతా కలిసి ఏపీభవన్లో ఏ విధంగా మాట్లాడారో.. ప్రజలంతా సోషల్ మీడియాలో చూశారని, చంద్రబాబు నాయుడు అంటే భయంలేని ఛానల్స్లో కూడా ప్రసారమయ్యాయన్నారు. తన పచ్చఛానళ్లలో వాటిని ప్రసారం చేయకుండా ఉండేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడ్డారన్నారు. జేసీ దివాకర్రెడ్డి, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్ మాట్లాడిన మాటలతో టీడీపీ బండారం బయటపడిందన్నారు. ఐదు కిలోలు తగ్గాలని ఉంది.. దీక్ష చేస్తా.. అని మురళీమోహన్రెడ్డి. జోన్ లేదు గీన్ లేదని అవంతి శ్రీనివాస్.. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. <br/>డేటింగ్ ప్రోగ్రాంలా సీఎం రమేష్నాయుడు నిరాహార దీక్ష చేస్తున్నారని అంబటి విమర్శించారు. పది రోజులుగా ఆరోగ్యం క్షీణించకుండా దీక్ష చేయడం ఏంటని, ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారన్నారు. పదకొండో రోజు చంద్రబాబు వచ్చే అవకాశం ఉందని, షుగర్ లెవల్స్ పడిపోకుండా ఏమైనా పదార్ధాలు తీసుకుని దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఎప్పడైనా పోరాటాలు చేశారా..? అని అంబటి ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు తెలుగుదేశం పార్టీ స్వతంత్ర పోరాటం చేసిందని నిసిగ్గుగా మాట్లాడారని గుర్తు చేశారు. రమేష్నాయుడు దీక్షకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యే విడతల వారిగా వచ్చి మద్దతు తెలుపుతున్నారని, రెండ్రోజుల క్రితం దీక్ష వేదికపై జేసీ దివాకర్రెడ్డి రమేష్ది ఉక్కు దీక్ష కాదు.. తుక్కు దీక్ష అని.. ఈ దీక్ష వల్ల ఉక్కు రాదు.. తుక్కురాదని మాట్లాడరని గుర్తు చేశారు. అంటే టీడీపీ దీక్షలపై సొంతపార్టీ నేతలకు నమ్మకం లేదన్నారు. అదే వేదికపై జేసీ బూతులు మాట్లాడినా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీక్షలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఈ నా కొడుకుల్లో కులతత్వం లేనిది ఎవరికీ అని వ్యాఖ్యానించారని, అన్ని బూతులు తిడుతున్నా.. వేదికపై కూర్చున్న వారికి ఎందుకు సిగ్గులేదని ప్రశ్నించారు. పార్టీ ప్రతిష్ట తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే బుట్టలో నుంచి జారిపోతారనే భయంతో చంద్రబాబు యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. <br/>పోరాటాలు, దీక్షలు చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు లేదన్నారు. దొంగ దీక్షలు చేస్తూ పోరాటాలంటేనే దౌర్భాగ్య పనులుగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ఆర్ సీపీ ఎంపీలు పదవులను సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షం ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపుతుంటే.. చంద్రబాబు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టే స్థాయికి దిగజారారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉద్యమాలు చేస్తే ప్రజలు విశ్వసిస్తారన్నారు. బీజేపీతో కుస్తీపడుతున్న వీరుడిలా చూపించే పచ్చమీడియా ప్రయత్నంలో చంద్రబాబు జోకర్గా మిగిలిపోతున్నారన్నారు. తన వైపల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైయస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారని, సోనియాగాంధీతో లాలూచీపడి చంద్రబాబు పెట్టించిన తప్పుడు కేసుల్లోంచి కడిగిన ముత్యంలా వైయస్ జగన్ బయటకు వస్తారన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం విజయవాడకు వచ్చిన కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు దేవినేని ఉమను పంపారని ఆరోపించారు.