కాంగ్రెస్, బీజేపీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

హైదరాబాద్ :

కాంగ్రెస్, బీజేపీ కలసి లోక్‌సభ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేశాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్ర భవితవ్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్ చేసిన బీజేపీ‌ చివరి నిమిషంలో ఎందుకు మౌనం దాల్చిందో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో బీజేపీ స్పష్టం చేయాలని నిలదీసింది. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి దుష్ట చతుష్టయంగా ఏర్పడి దుర్మార్గంగా వ్యవహరించి తెలుగుజాతిని అడ్డగోలుగా చీల్చేశారని మండిపడింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్‌రావు, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.

లోక్‌సభలో టీ-బిల్లు ఆమోదించిన తీరును పార్టీ నాయకులు తీవ్రంగా ఎండగట్టారు. పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, డాన్ మాదిరిగా చీకట్లో సభా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని‌ వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన పార్లమెంటులోనే దిక్కులేకపోతే ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులకన్నా క్రూరంగా వ్యవహరించి దేశ పరువు తీశారని ధ్వజమెత్తారు.

అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎందుకు నిలువరించలేదని, పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్ ఎ‌త్తివేయాలని తదితర డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చిందని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టింది? ఈ విషయంలో బీజేపీ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే తెలుగు‌ ప్రజలను దారుణంగా వంచించిందని దుయ్యబట్టారు.

తెలుగు ప్రజల వల్లే కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్‌కు ఏపీ పట్ల కృతజ్ఞతాభావం లేకపోగా బీజేపీతో విందు రాజకీయాలు చేసి నిట్టనిలువునా చీల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ భవిత‌వ్యాన్ని పార్లమెంటులో కేవలం 23 నిమిషాల్లోనే ముగిస్తారా? అంటూ నిలదీశారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.

గడిచిన ఆరు నెలలుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్ని రాష్ట్రాలు తిరిగి పార్టీల మద్దతు కూడగట్టడం వల్లే లోక్‌సభలో సీపీఎం, ఏఐడీఎంకే, తృణమూల్ కాంగ్రె‌స్ తదితర పార్టీలకు చెందిన 100 మందికిపైగా సభ్యులు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వె‌ల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారన్నారు. అయితే వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై రాష్ట్రాన్ని చీల్చాయని తూర్పారపట్టారు. విభజనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలుగు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని పార్టీ అధికార ప్రతినిధులు హెచ్చరించారు.

Back to Top