వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకే బాబు ఢిల్లీ పర్యటనలు


న్యూఢిల్లీ: చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకు ఢిల్లీకి వస్తుంటారని, ఆయన మనస్తత్వం జాతీయ నాయకులకు అర్థమైందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం చేసినా, దొంగతనం చేసినా వెంటనే చంద్రబాబు ఢిల్లీకి పరుగెత్తుకొని వచ్చి జాతీయ నాయకులను, వ్యవస్థలను మేనేజ్‌ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో శరద్‌యాదవ్‌ను వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటుకు కోట్లు కేసులో కూడా చంద్రబాబు ఇదే విధంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత చంద్రబాబు ఢిల్లీకి  వచ్చారని, మళ్లీ రేపు ఢిల్లీకి రాబోతున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి నాయకులు ఎవరూ కూడా చంద్రబాబు మనస్తత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన అవినీతి, అబద్ధాలను జాతీయ నాయకులు పూర్తిగా అర్ధం చేసుకున్నారని చెప్పారు. జాతీయ నాయకులు అందరూ కూడా ఈ ఘటనను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారని చెప్పారు. శరత్‌యాదవ్, సీతారాం ఏచూరి మా వాదనలో న్యాయం ఉందని సమర్ధించారని తెలిపారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంలో పాత్రదారులు, సూత్రదారులపై నిష్పక్షపాతంగా విచారణ చేపడితే నిజాలు వెలుగు చూస్తాయని చెప్పారు. 
Back to Top