– ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైయస్ జగన్ హామీ
– చంద్రబాబు ఆర్యవైశ్యులకు చేసింది ఏమీ లేదు
– వైయస్ జగన్కు ఆర్యవైశ్యులను దగ్గర చేస్తాం
– త్వరలో అన్ని జిల్లాల్లో అధ్యయన కమిటీ పర్యటన
– విజయవాడలో ఆర్యవైశ్యుల అధ్యయన కమిటీ భేటి
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైశ్యుల వ్యతిరేకి అని వైయస్ఆర్సీపీ ఆర్యవైశ్యుల అధ్యయన కమిటీ గౌరవ సలహాదారు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. విజయవాడలో ఆదివారం వైయస్ఆర్సీపీ ఆర్యవైశ్యుల అధ్యయన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యయన కమిటీ కన్వీనర్ ద్వారకానాద్, వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడారు. ఆర్యవైశ్యుల ఆర్థిక స్థితిగతుల కోసం వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల అధ్యయన కమిటీ నియమించారన్నారు. ఈ కమిటీ ప్రతి జిల్లాలో పర్యటించి ఆర్యవైశ్యుల స్థితిగతులను పరిశీలిస్తామన్నారు. ఈ కమిటీకి కన్వీనర్గా నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారకానా«ద్ను, తనను గౌరవ సలహాదారుగా నియమించినట్లు చెప్పారు. ఈ రోజు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాలో పర్యటించి, ఆర్యవైశ్యుల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. ఆర్యవైశ్యులను వైయస్ జగన్కు దగ్గర చేస్తామన్నారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. రూ.30 కోట్లు ఇస్తున్నామని చెప్పిన చంద్రబాబు కనీసం రూ.3 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి విషయంలో రాజకీయం చేయడం అలవాటైన చంద్రబాబుకు ఆర్యవైశ్యులను కూడా వదల్లేదన్నారు. ఉన్నంతలో ఇతరులకు సేవా చేయాలన్న స్వభావం కలిగిన ఆర్యవైశ్యులను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఆర్యవైశ్యులను మభ్యపెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. అన్ని జిల్లాల్లో పర్యటించి, ఆర్యవైశ్యుల్లో చైతన్యం లె స్తామని పేర్కొన్నారు. అర్హులైన ఆర్యవైశ్యులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
వైయస్ జగన్ ఆర్యవైశ్యుల పక్షపాతి: డిప్యూటి మేయర్ ద్వారకానాద్
వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆర్యవైశ్యుల పక్షపాతి అని ఆర్యవైశ్యుల అధ్యయన కమిటీ కన్వీనర్ నెల్లూరు డిప్యూటి మేయర్ ద్వారకానాద్ అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్యవైశ్య అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆర్యవైశ్యులలోని పేదలను ఏరకంగా ఆదుకోవాలన్న దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమ్మవారి శాలతో పాటు ఆర్యవైశ్యులు నిర్వహించే అన్ని అన్నదాన సత్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారని గుర్తు చేశారు. వైయస్ జగన్ ఆర్యవైశ్యుల పక్షపాతి అని, చంద్రబాబు మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మూడు నెలలు అయినా చంద్రబాబు సమయం కేటాయించడం లేదని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రి సిద్ధరాఘవరావును పెట్టుకొని ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఇస్తున్నానని చంద్రబాబు మాట ఇచ్చారన్నారు. సంక్షేమ నిధి పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వైశ్యులకు ఏరకమైన సాయం చేయగలమన్న అంశాలపై అధ్యయనం చేసి అధ్యక్షులు వైయస్ జగన్కు నివేదిక ఇస్తామని, ఆయన వైశ్యుల అభ్యున్నతికి తగు నిర్ణయాలు తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.