క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆందోళ‌న‌


క‌డ‌ప‌: గండికోట జలాల సరఫరాలో రైతుల ప్రయోజనాలను విస్మరించి జిల్లాలోని అధికార పార్టీ నాయకులు జల రాజకీయాలకు పాల్పడ‌టాన్ని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, మేయ‌ర్ సురేష్‌బాబు, రైతులు ధ‌ర్నాకు దిగారు. అధికార పార్టీ నేత‌ల  ఒత్తిడి మేర‌కు  సర్వరాయసాగర్‌కు నీటి విడుదల నిలిపివేయ‌డం ప‌ట్ల వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి నవంబర్‌ 30వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే నాల్గవ తేదీలోగా సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆయన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం వామికొండ జలాశయం నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేశారు. కృష్ణాజలాలు సర్వరాయసాగర్‌కు వస్తున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డిలతో కలిసి సోమవారం సాయంత్రం పూజలు చేసేందుకు సర్వరాయసాగర్‌ కాలువ వద్దకు వెళ్లారు. 

టీడీపీ నేత‌ల ఒత్త‌డితో నీటి విడుద‌ల నిలుపుద‌ల‌
ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు పూజలు చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో టీడీపీ నాయకులు ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి చేసి నీటి విడుదలను నిలిపి వేయించారు. విషయం తెలిసి ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఇతర నాయకులు పెద్దఎత్తున మండల రైతులతో కలిసి వామికొండ జలాశయం క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ నీరు నిలుపుదల చేశారని తెలియగానే కలెక్టర్‌ బాబూరావునాయుడు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డిలతో రవీంద్రనాథరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. నీరు ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. పైనుంచి ఉత్తర్వులు అందలేదని, రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు అందగానే నీరు విడుదల చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. దీనికి నిరసనగా నేతలందరూ వామికొండ క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నీరు విడుదల చేసేంతవరకు కదలమని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అధికారులకు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించారని  తెలియగానే కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య, ముద్దనూరు ఎస్‌ఐ నరసింహారెడ్డిలు తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. నిరసనను ఆపాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే నిరాకరించడంతో బలవంతంగా అందరినీ ముద్దనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. అధికారుల తీరుకు నిర‌స‌న‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు క‌లెక్ట‌రేట్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు.

తాజా వీడియోలు

Back to Top