చంద్రబాబు చేసిన అప్పులు ఏం చేశారో చెప్పాలి



– రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజలు పన్ను కడితే..బాబు మోసం చేస్తున్నారు
– రాజధానికి కేంద్రం రూ. 3 వేల కోట్లు ఇచ్చింది
– అమరావతి బాండ్లపై అధిక వడ్డీ ఇస్తున్నారు
–  మీ బినామీలున్న చోట్ల అభివృద్ధి చేస్తే..మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?
హైదరాబాద్‌: చంద్రబాబు చేసిన అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దుబారా ఖర్చులతో ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని, మళ్లీ ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రానికి సీఈవోగానో, బ్రోకర్‌గానో, స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్‌గా పని చేస్తున్నారో చెప్పాలని పట్టుబట్టారు. అప్పులు చేసేది పెద్ద ఘనత అన్నట్లుగా గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కష్టపడి పని చేస్తూ..వచ్చిన ఆదాయంతో పన్నులు కడుతూ..రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలనుకుంటన్న ప్రజలకు ఈ చంద్రబాబు చాలా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో రూ. 90 వేల కోట్ల అప్పులను రూ.2.50 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.3 వేల కోట్లు ఇస్తే..ఆ డబ్బులతో చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టించానని చెబుతున్నారన్నారు. పోలవరానికి కేంద్రం రూ.9 వేల కోట్లు ఇచ్చిందని చెబుతున్నారని, చంద్రబాబు చేసిన అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కొత్తగా ఈ రోజు చంద్రబాబు బాంబేకు వెళ్లి గంట మోగిస్తున్నానని, తాను పెట్టిన బాండ్లు చరిత్ర సృష్టిస్తాయని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఈ బాండ్లపై నిత్యం మాట్లాడే కుటుంబ రావు రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌తో పెట్టుబడులు వస్తే..10.30 శాతం వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎందుకు ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని ప్రశ్నించారు. 

ఒక పక్క రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల  ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని, మరోపక్క పంట చేతికందకుండా కొట్టుకుపోయిందన్నారు. తాగే నీళ్లకు కరువు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇక్కడ ఇన్ని కష్టాలు ఎదుర్కొంటుంటే..చంద్రబాబు ముంబాయికి వెళ్లి గంట కొడతారంట అని నిప్పులు చెరిగారు. బాండ్లు తీసుకున్న వారి పేర్లను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రి, మరో కేంద్ర మంత్రి సుజాన చౌదరిలు వేల కోట్లు బ్యాంకుకు ఎగనామం పెట్టారని విమర్శించారు. ఇటువంటి చరిత్ర కలగిన వారిని చంద్రబాబు తన చుట్టూ పెట్టుకొని రూ.48 వేల కోట్లకు టెండర్లు పిలుస్తున్నారంటే ఏ మెసేజ్‌ ఇస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ రూ.200 కోట్లు 9 శాతం వడ్డీకి తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాదిరిగా జీహెచ్‌ఎంసీ పబ్లిసిటి చేయడం లేదన్నారు. చంద్రబాబు 13 జిల్లాల ప్రజలపై పన్నుభారం మోపుతూ ప్రభుత్వం దుబారా చేస్తుందని విమర్శించారు. రూ.48 వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు తన బినామీలు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నారని తప్పుపట్టారు. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలవలేడని తెలిసి ఇప్పుడు హడావుడిగా టెండర్లు పిలిచి వారి నుంచి 5 శాతం కమీషన్లు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ భారమంతా ప్రజలపై మోపాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో మేధావులు, విద్యార్థులు ఉన్నారని, ఒక్కసారి చంద్రబాబు చర్యలను ఆలోచించాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞాప్తి చేశారు. మన భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనం చేసే అప్పులకు ఆ మాత్రం ఆస్తులున్నాయో లేదో చూసుకోకుండా ఏడాపెడా అప్పులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో కూడా చంద్రబాబు అప్పులు అధికంగా చేశారని, ఆస్తులేమో తక్కువగా ఉండేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలోని అప్పులు, ఆస్తులకు వ్యత్యాసం చూడాలని కోరారు. మహానేత పాలనలో అప్పులు తక్కువ, ఆస్తులు ఎక్కువుగా పెరిగాయని, ఎవరు గొప్ప ముఖ్యమంత్రినో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ పాలనలో ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు కట్టడం వేస్తు అన్న చంద్రబాబు, ఇవాళ ఆయన అదే చేస్తున్నారని వివరించారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దుబారాలు తగ్గించుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు రాష్ట్రంలోని 5 చోట్ల తన కాన్వాయ్‌లు ఏర్పాటు చేసి దుబారా చేస్తున్నారని చెప్పారు. బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాలకు నిన్ననే రూ.6 కోట్లు విడుదల చేశారన్నారు. చంద్రబాబు సెక్యూరిటీకి నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ధర్మ పోరాట దీక్షకు రూ. 30 కోట్ల చొప్పున వినియోగిస్తున్నారని విమర్శించారు. రిపేరీలకే రూ.200 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని చెబుతూనే ఇవాళ దుబాయికి ప్రత్యేక విమానాల్లో వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 కిలోమీటర్లకు ప్రత్యేక హెలికాప్టర్‌ వినియోగిస్తూ ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. 
 
Back to Top