వైయస్ఆర్ జిల్లా: అబద్ధాలు ఆడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వొచ్చని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎమ్మెల్యే అంజద్బాషా, మేయర్ సురేష్బాబు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైయస్ఆర్ సీపీ నేతలు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని వైయస్ఆర్ సీపీ గతంలో పోరాడిందని, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రత్యేక హోదా సంజీవని అనే నినాదంతో ఒకే మాటపై నిలబడ్డారన్నారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే కోట్లాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అహర్నిశలు వైయస్ జగన్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా 24వ తేదీన రాష్ట్ర బంద్కు వైయస్ జగన్ పిలుపునిచ్చారన్నారు. ప్రజలంతా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటారని, వైయస్ జగన్ నాయకత్వంలోనే హోదా సాధ్యమవతుందన్నారు.