విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లేకపోవడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్కు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో కూడా ప్రాధాన్యత కల్పించకపోవడంతో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖలోని జగదాంబ జంక్షన్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్కడే రాస్తారోకో చేపట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ఏపీని చిన్నచూపు చూసిందని ధ్వజమెత్తారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు.