హ‌త్యాయ‌త్నం వెనుక చంద్ర‌బాబు హ‌స్తం



విశాఖపట్నం: సీబీఐతో రాష్ట్రానికి సంబంధం లేకుండా జీవో తేవడాన్ని బట్టి వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం వెనక  ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి హస్తం ఉందని స్పష్టంగా అర్ధమవుతోందని  వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరులతో మాట్టాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని చంద్రబాబు  మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే సబ్బవరంలో ఎప్పుడో శంకుస్థాపన చేశారని తెలిపారు. దీనికి చంద‍్రబాబు మళ్లీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 

చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు పునాది రాళ్లతోనే ఆగిపోతాయని, చంద్రబాబు పునాది రాళ్ల సీఎంగా ప్రజల్లో గుర్తుండిపోతారని గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. దేవాదుల ప్రాజెక్టును అలాగే పునాది రాళ్లతో సరిపెట్టారని విమర్శించారు. పోలవరం పూర్తి అయితేనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధ్యమవుతుందని వైయ‌స్‌ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.

గంజాయి అక్రమరవాణాకు సూత్రధారి అయ్యన్న
దేశవ్యాప్తంగా జరుగుతున్న గంజాయి అక్రమరవాణాకు ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడే సూత్రధారి అన్న మరో టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస రావు మాటలకు అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో మంత్రి గంటా శ్రీనివాస రావు హస్తం ఉందని అప్పుడు అయ్యన్న అన్నారు...ఇపుడు గంటాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చి ఎందుకు మాట్లాడం లేదు..ఈ విషయంలో అయ్యన్న పాత్రుడికి ఎంత ముట్టిందని ప్రశ్నించారు.
 


Back to Top