గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీసు స్టేషన్ తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటివి చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. వాస్తవాలు చూసేందుకు వెళితే ప్రభుత్వానికి ఎందుకు భయమని నిలదీశారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్పై వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తున్నామని, ఎందుకు ప్రభుత్వానికి ఇంత భయమన్నారు. ఈ ప్రభుత్వం పర్యవసనాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.