వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్ పర్యటనలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఓరుగల్లు ప్రజలు రాజన్న బిడ్డకు అపూర్వ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. కష్టాలు తీర్చే తమ బాంధువుడి బిడ్డ వచ్చాడని సంతోషించారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ వెళ్లిన ప్రతి చోట ప్రతి అక్క- చెల్లి, ప్రతి అన్నా-తమ్ముడు, అవ్వ తాత అంతా ఏకమై జగన్ కు మద్దతుగా నిలిచారు. ప్రజానాయకుడికి తమ కష్టాలను విన్నవించుకొని గుండెబరువు దించుకున్నారు.<br/>తెలంగాణ వస్తే బతుకులు బంగారు మయం అవుతాయని టీఆర్ఎస్ కు ఓటేస్తే..కేసీఆర్ రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని ప్రజలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయకుండా మాయమాటలతో గారడీలు చేస్తున్న టీఆర్ఎస్ కు ఉపఎన్నికలో తగిన బుద్ధి చెబుతామంటున్నారు. రుణాలు మాఫీకాక, పంటలకు గిట్టుబాటు లేక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు మచ్చుతునక.<br/>ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు తెలంగాణ వచ్చే మొహమే లేకుండా పోయింది. ఎన్నికలు జరుగుతున్నా పోటీకి దూరంగా ఉన్నాడు. మిత్రపక్షానికి మద్దతు పలికి ప్రచారానికి దూరమై వెన్నుపోటు పొడిచాడు. పోటీలో అయితే దిగారు కానీ టీడీపీ-బీజేపీ నేతలు పెద్దగా పర్యటించింది లేదు. ప్రజలను పట్టించుకుంది లేదు. బీహార్ ప్రజల దెబ్బకు బీజేపీ కుదేలయిపోయింందని విశ్లేషకులు అంటున్నారు. <br/>కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పనక్కర్లేదు. రాజయ్య ఇంట్లో నలుగురు సజీవమైన ఘటన యావత్ ప్రజానీకాన్ని కన్నీరుపెట్టించింది. ఇలాంటి మనిషికా టికెట్ ఇచ్చింది అంటూ ప్రజలు, ప్రజాసంఘాలు కాంగ్రెస్ పై నిప్పులు గక్కారు. తర్వాత నాలుక కర్చుకున్న హస్తం నేతలు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న సర్వే సత్యనారాయణను ఉన్నపలంగా వరంగల్ బాట పట్టించారు. అస్తవ్యస్తమైన హస్తాన్ని ప్రజలు మరోసారి దూరం పెట్టే కనిపిస్తోంది. <br/>అద్భుతమైన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న మహానేత రాజన్న వైపే ప్రజలు మక్కువ చూపారు. తమ బతుకులు బాగుపడాలంటే రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని విశ్వసించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు చిన్నా పెద్ద అంతా ఈతరం నాయకుడికి అపూర్వ స్వాగతం పలికారు. తమ గోడును జననేత ముందు వెళ్లబోసుకున్నారు. వారి సాధకబాధలను వైఎస్ జగన్ సావధానంగా వింటూ తన ప్రచారం కొనసాగించారు.