<br/>అనంతపురం ) మునిసిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి. ఇప్పుడు వాళ్ల కనీస హక్కుల్ని కూడా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మనిషేనా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇస్తున్నామని, ఈ లోపు స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామని హెచ్చరించారు. పద్నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ, చంద్రబాబుకు కనిపించటం లేదా అని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లా లో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్.. మునిసిపల్ కార్మికుల సమ్మె పై స్పందించారు. శుక్రవారం జరిగే మునిసిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. జీతాలు పెంచమంటే ఉక్కుపాదంతో అణచి వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి తప్పడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచితే రూ. 200 నుంచి రూ. 300 కోట్లు భారం పడుతుందన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్ పరిచే చంద్రబాబుకు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు.