ఆ ఘనత వైయస్‌ఆర్‌దే




– నాలుగేళ్ల బాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?
– నీరు–చెట్టు పథకంలో దోపిడీ
– చినరాజప్ప డిప్యూటి సీఎంగా ఉండగానే ఆరు హత్యలు జరిగాయి
– కాపు రిజర్వేషన్ల గురించి బాబును చినరాజప్ప అడగడం లేదు
– పోలవరంలో దారుణంగా అవినీతి జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు
– మంత్రి యనమల వియ్యంకుడు సుధాకర్‌కు పోలవరం కాంట్రాక్టు పనులు
– పోలవరం కుడి, ఎడమ కాల్వ పనులు వైయస్‌ఆర్‌ హయాంలోనే పూర్తి
– పెద్దాపురం ఆసుపత్రిలో నలుగురే డాక్టర్లే 
– సామర్లకోట ఆసుపత్రికి ఒక్క అంబులెన్స్‌ లేదు
– మహిళలకు బ్యాంకుల్లో సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం
– పొదుపు సంఘాల రుణాలు నాలుగు ధపాలుగా నేరుగా అక్కాచెల్లెమ్మలకు ఇస్తాం
 
తూర్పు గోదావరి: లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు కూడా ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ కలలను నిజం చేస్తానని, ప్రతి చేనేత ఇంట్లో నాన్న ఫోటోతో పాటు తన ఫోటో ఉండేలా పాలన చేస్తానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. 2024లో జరిగిన ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఒక్క మందు షాపు కూడా కనిపించకుండా చేస్తానని మాట ఇచ్చారు. 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పెద్దాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవాల్సిన అవసరం లేదు. అయినా కూడా నాతో పాటు వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు అర్జీలు ఇస్తూ..మరో వైపు నా భుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీకు తోడుగా ఉంటామని అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇవన్నీ కూడా పక్కన పెడుతూ చిక్కని చిరునవ్వుతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. 
– పెద్దాపురం నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటేంటో తెలుసా? అన్నా..మా పెద్దాపురానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పేరు రాజప్ప..అన్నా..ఈయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి..హోంమంత్రి..కానీ ఇదే నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్లలో అక్షరాల ఆరు హత్యలు జరిగాయని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
– ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజన్న ..పక్క పార్టీలకు పింఛన్లు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నా అని చెబుతున్నారు. ఈయన చంద్రబాబుకు ఏ స్థాయిలో వంగి వంగి నమస్కారం చేస్తున్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సొంత సామాజిక వర్గానికి అండగా నిలవాల్సింది పోయి..చంద్రబాబు అణచివేతలో ఈయనే ఒక ఆయుధం అయ్యారు. ఇక్కడి ప్రజలు కష్టాలు చెబుకుంటూ..రైతులు బాధలు చెబుతున్నారు.
– అన్నా ..పక్కనే పోలవరం ప్రాజెక్టు ఉంది. నాన్నగారి పాలనలో ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాయి. ఈ పాలకుల హయాంలో నత్తనడకన సాగుతున్నాయని  ఇక్కడి ప్రజలు చెబుతుంటే..ఇదే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు తన అవినీతికి కల్పవృక్షంగా మార్చుకున్నారు. తన బినామీలకు పోలవరం పనులు నచ్చిన రేట్లకు ఇచ్చి..నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ దోచుకుంటున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఎప్పుడన్నా..ఈ పనులు పూర్తి అయ్యేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. సోమవారం సోమవారం చంద్రబాబు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుసా అన్నా..ఆయన ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్లతో లెక్కలు తెంచుకుపోతున్నారని చెబుతున్నారు. ఇదే చంద్రబాబు పోలవరం పనులు 56 శాతం పూర్తి అయ్యాయని డంబాలు పలుకుతున్నారు. ఇందులో 80 శాతం పనులు దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తి అయ్యాయన్న విషయాన్ని పక్కన నెట్టి తన హయాంలోనే అంతా జరిగిందని చెప్పుకుంటున్నారు.
– పక్కనే తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకొని గోదావరి నీరు తరలిస్తే..మాకు నీళ్లు ఎలా వస్తాయని రైతులు వాపోతున్నారు. రైతులు కష్టపడి ధాన్యాన్ని పండిస్తే..కనీస మద్దతు ధర రూ.1550 అంటున్నారు. ఇది ఒట్టి మాటలే. ధాన్యం అమ్ముకునేందుకు వెళ్తే రూ.1150 కూడా గిట్టడం లేదని వాపోతున్నారు.
– అన్నా..చెరుకు పండిస్తున్నాం. రేటు చూస్తే..టన్నుకు రూ.2 వేలు కూడా గిట్టడం లేదన్నా.. టన్ను చెరుకు నరకడానికి, రవాణా చేసేందుకు రూ.1100 ఖర్చు అవుతుందని, ఉత్తరప్రదేశ్లో రూ.3150 ఇస్తున్నారని, ఇక్కడేందుకు ఇంత తక్కువగా ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. పోనీ బెల్లం తయారి చేసుకుందామంటే దానికి కూడా గిట్టుబాటు ధర లేదన్నా అంటున్నారు. నాన్నగారి పాలనలో బెల్లానికి రూ.5 వేలు గిట్టుబాటు ధర ఉండేదని చెబుతున్నారు.
– సాగుదుంపలు జిల్లాలో 11 మండలాల్లో సాగు అవుతుంది. గతేడాది రూ.1150 ధర వస్తే..పంట చేతికి వచ్చేసరికి రూ.1000కి పడిపోయిందని, మాకు గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తుందన్నా అంటూ వాపోతున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? 
– నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. డెల్టా ఈస్ట్రన్‌ కెనాల్‌పై ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, ఇవి సరిగ్గా నిర్వహించలేక మరమ్మతులకు గురైతే నాన్నగారి హాయంలో వీటిని గాడిలో పెట్టారని చెబుతున్నారు. ఈ లిప్టులకు ఉచిత  విద్యుత్‌ ఇచ్చిన ఘనత రాజశేఖరరెడ్డి గారిది అని చెబుతున్నారు. మరో కొత్త ఎత్తిపోతల పథకం కూడా నిర్మించారని చెబుతున్నారు. తాగునీటి కోసం అలమటిస్తున్న గ్రామాలకు నీరు ఇవ్వడమే కాదు..పంటలకు నీరు ఇచ్చార ని నాన్నగారిని తలుచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది.
– ఇవాళ అదే ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు కట్టడం లేదని, మాకు నీళ్లు ఎలా వస్తాయని రైతులు వాపోతున్నారు. తాగడానికి నీరు లేదన్నా అంటున్నారు. దాదాపు 850 ఎకరాల్లో 1200 మంది దళితులకు దశాబ్ధాల క్రితం భూములు పంపిణీ చేశారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 650 ఎకరాలు ఇచ్చి, బోర్లు వేయించి అండగా నిలిచారన్నా అంటున్నారు. ఈ భూముల్లో నాలుగుఅడుగులు అని చెప్పి టీడీపీ నేతలు రాళ్లు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. సాక్షాత్తు హోం మంత్రి కొడుకు పేరు కూడా చెబుతున్నారు.
– చెరువులను తాటిచెట్టు ఎత్తు లోతు తవ్వి అమ్ముకుంటున్నారన్నా అని చెబుతున్నారు. నీరు–చెట్టు పథకం మట్టిని అమ్ముకునేందుకేనా అని అంటున్నారు. ఒకవైపు చెరువులను తవ్వినందుకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ..మరోవైపు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. చంద్రబాబే రిబ్బన్‌ కట్‌ చేసి దోపిడీని ప్రారంభించారని చెబుతున్నారు. మట్టిని, ఇసుకను వదలకుండా దోచుకుంటున్నారు ఈ పాలకులు.
– పెద్దాపురం, సామర్లకోటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నీరు కలుషితమవుతుందని, ఈ నీరు తాగలేక ప్రతి ఏటా వందల కొద్ది డయోరియా కేసులు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందంటే..అన్నా..పక్కనే పెద్దాపురం ఆసుపత్రి..ఇది పేరుకే వంద పడకల ఆసుపత్రి, అక్కడేమో  బెడ్డులు మాత్రం 56 మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. నలుగురు వైద్యులు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్టు, ఎముకల డాక్టర్‌ లేడని ప్రజలు చెబుతున్నారు. ఇదే ఆసుపత్రిలో మూడు అంబులెన్సులు ఉండాల్సిన చోట ఒక్కటి కూడా పని చేయడం లేదు. నర్సుల కొరత ఉందని, జనరేటర్‌ కేపాసిటి కూడా సరిగా లేదని చెబుతున్నారు. ఆ పక్కనే సామర్లకోట ఆసుపత్రిలో కూడా 30 పడకలకు కేవలం ఆరు బెడ్డులు మాత్రమే ఉన్నారని, ఇద్దరు డాక్టర్లే ఉన్నారని చెబుతున్నారు.  ఆ ఆసుపత్రి ఉండి కూడా లాభమేమని చెబుతున్నారు. ఇంతకన్న దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఇంతటి దారుణంగా పరిస్థితి ఉంది. సాక్షాత్తు డిప్యూటి సీఎం నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే..మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు పక్కా  ఇల్లు కట్టించి తోడుగా ఉన్నారని, పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు చంద్రబాబు దగ్గరుండి లాక్కుంటున్నారని చెబుతున్నారు. అక్కడ పేదవారి కోసం ప్లాట్లు కడతామని డ్రామాలాడుతున్నారు. ఇందులో అవినీతి జరుగుతోంది. పేదవారి ఇళ్ల వద్ద అవినీతి చేసే అన్యాయమైన ముఖ్యమంత్రిని ఏమంటారు. పేదవాడి ప్లాట్లను అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్ముతారట. పేదవాడికి రూ.6 లక్షలకు ప్లాట్లు అమ్ముతున్నారు. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి మీద అప్పుగా రాసుకుంటే..25 సంవత్సరాల పాటు నెలకు రూ.3 వేల చొప్పున ఆ పేదవాడు కడుతూ పోవాలంటా? లంచాలు తీసుకునేది చంద్రబాబు..పేదవాడు నెల నెల కంతులు కడుతూ పోవాలట
– చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర ఉందని ఓట్ల కోసం పేదవారికి ప్లాట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తారు. ఒకేవేళ ప్లాట్లు ఇస్తే తీసుకోండి. వద్దు అనకండి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం రాగానే  ఆ ప్లాట్లపై మీరు కట్టాల్సిన బ్యాంకు రుణాలు రూ.3 లక్షల రుణం మొత్తం మాఫీ చేస్తానని మాట ఇస్తున్నా.
– ఇదే ని యోజకవర్గంలో చేనేతలు ఉన్నారు. చేనేతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ..చంద్రబాబు చేనేతలకు సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు. చివరకు అప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించిన బకాయిలు పది నెలలుగా బకాయిలు ఉన్నాయి. కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. చేనేత పరిశ్రమ దివాళ తీసిన పరిస్థితి చంద్రబాబు పాలనలో వచ్చిందని చెబుతున్నారు. చేనేతలకు చెబుతున్నాను. మళ్లీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తానని మాట ఇస్తున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతగా మేలు చేస్తానంటే నేను చనిపోయిన తరువాత ప్రతి చేనేత ఇంట్లో  నాన్న ఫొటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నాను.
– పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పాలన మీరందరూ చూశారు. ఇంతదారుణంగా పాలన జరుగుతోంది. ఇక్కడి కంటే రాష్ట్రంలో ఇంకా అన్యాయంగా చంద్రబాబు పాలన ఉంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే..రైతులకు సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. రైతులు, అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ పూర్తిగా లేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. చివరికి ప్రత్యేక హోదా కూడా లేదు. చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందుకు వెళ్లదు. కాంట్రాక్టర్లు నుంచి మొదలు ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, మద్యం, రాజధాని భూములు, చివరకు గుడి భూములను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోలు డీజీల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు. స్కూల్‌ ఫీజులు కూడా బాదుడే బాదుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నాలుగేళ్లలో నిర్వీర్యం చేశారు. పిల్లలకు పెద్ద చదువులు చదివించాలంటే అప్పులపాలవుతున్నారు. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. పేదవాడికి రోగం వస్తే ఇవాళ లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గర్భిణుల ప్రసవానికి రూ.50 వేలు అడుగుతున్నారు.
– ప్రత్యేక హోదా– చంద్రబాబు డ్రామాలు అనే కొత్త సినిమా చూస్తున్నాం. ఈ డ్రామాలు రోజు టీవీల్లో, పేపర్లలో చూస్తున్నాం. అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అక్రమాలు. ఇవే నాలుగేళ్లుగా చూస్తున్నాం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఒక్క జగన్‌ వల్ల సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఏదైనా హామీ ఇచ్చి నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. 
–చంద్రబాబును పొరపాటున క్షమిస్తే ఈ వ్యవస్థ ఇంకా దిగజారి పోతుంది. ఈయనను క్షమిస్తే..రేపు పొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి మీ వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి 98 శాతం పూర్తి చేశానని మొట్ట మొదట చెవ్వుల్లో పువ్వు పెడతారు. ఆ తరువాత మైక్‌ పుచ్చుకొని ఏమంటారో తెలుసా? ఈ సారి చిన్న  చిన్న అబద్ధాలు, మోసాలకు చంద్రబాబును నమ్మరని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు అనే నాకు ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరని ఆయనకు తెలుసు అందుకే బోనస్‌  ఇస్తానంటారు. కేజీ బంగారానికి బొనస్‌గా బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ..ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రలను పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెడతారు. నమ్ముతారా? కానీ, డబ్బులు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. కానీ ఓట్లు వేసే సమయంలో మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పులు వస్తాయి. 
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది నవరత్నాల ద్వారా ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ప్రతి మీటింగ్‌లోనూ కొన్ని విషయాలనే చెబుతున్నాను. ఈ మీటింగ్‌లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్క చెల్లెమ్మలకు ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు నాలుగు ధపాలుగా రుణాలు నేరుగా మీ చేతుల్లోనే పెడతామని, సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని, దశలవారిగా మద్యాన్ని నిషేదిస్తామని మాట ఇచ్చారు.  ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి..వాటిని స్వీకరిస్తాం. మీ అందరికి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.
 
Back to Top