అనంతపురం) చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చుకొనేందు కోసం మనమంతా ఏకమవుదామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. అనంతపురం జిల్లా బత్తులపల్లి లో రైతు భరోసా యాత్రం సందర్భంగా వేలాది అభిమానులు పోగుపడటంతో వాహనం నుంచే ఆయన స్థానికుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు ఇచ్చిన హామీలే కనిపించేవని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కానీ అవేమీ ఇప్పుడు అమలు కావటం లేదని చెప్పారు. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెబితే చంద్రబాబు అడ్డంగా బుకాయించాడని, ఆయా కుటుంబాల దగ్గరకు తాను వెళ్లి చూపిస్తానని చెప్పి రైతు భరోసా యాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వంద మందికి పైగా ఆత్మహత్యలు చేసుకొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేయకుండా తప్పించుకొంటున్నారు. దాదాపు 87వేల కోట్లు అప్పులు ఉంటే వీటికి వడ్డీయే రూ. 20 వేల కోట్లు అవుతుంది. కానీ, చంద్రబాబు ఇచ్చింది రూ. 7వేల కోట్లు అంటే వడ్డీలో మూడో వంతు ఇచ్చి రుణమాపీ చేశానని చెబుతున్నాడు. డ్వాక్రా మహిళల్ని అడిగితే మూడు పంగ నామాలు పెట్టాడని చెబుతున్నారు. నిరుద్యోగుల్ని అడిగితే కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని వాపోతున్నారు. పీల్డ్ అసిస్టెంట్ లు 35 వేల మంది, ఆదర్శ రైతులు 40 వేల మంది, అంగన్ వాడీ ఉద్యోగులు 40 వేల మంది.. ఇలా చెప్పుకొంటూ పోతే వేల మందిని ఉద్యోగాలు తీసేసి ఇంటికి పంపిస్తున్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చాక ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు. కనీసం కరువు మండలాల్ని కూడా కరెక్టు గా ప్రకటించలేదు. వానలు పడ్డాక కరువు మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అని మనం చెప్పవచ్చు. ఇంత దారుణంగా రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు భరోసా యాత్రలో పర్యటిస్తుంటే చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ. 5 లక్షల పరిహారాన్ని కూడా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబు కి బుద్ది రావాలంటే మనమంతా ఏకం కావాలి. చంద్రబాబుకి బుద్ది వచ్చేటందుకు గడ్డి పెట్టాల్సిన అవసరం ఉంది. హామీలు నెరవేర్చేదాకా ఒత్తిడి తీసుకొనిరావాలి. ఇక్కడకు వచ్చిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ వైఎస్ జగన్ ముగించారు.