సాలూరు..సంబ‌రాలు

 

వైయ‌స్ జ‌గ‌న్ రాక‌కోసం సాలూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎదురుచూపులు
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న‌
- నేడు సాలూరులో  బహిరంగ సభ 

విజయనగరం: ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి... జననేతకు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి.  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  వైయ‌స్ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు రోజు నుంచి వ్యతిరేక ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ  దుష్ఫ్రచారానికి ఒడిగట్టిన అధికారపక్షం అదే సంస్కృతి  కొనసాగింది. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో జిల్లాలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో చూసి ప‌చ్చ‌నేత‌లు ఓర్వలేక‌పోతున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం శివారు నుంచి ప్రారంభమైంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు. జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. రామభద్రపురం శివారు నుంచి పాదయాత్ర  తారాపురం, మిర్తివలస క్రాస్‌, కొట్టిక్కి జంక్షన్‌, జిన్నివలస క్రాస్‌ మీదుగా సాలూరు వరకు కొనసాగనుంది. సాయంత్రం సాలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

అందరిదీ ఒక్కటే లక్ష్యం. ఆయన్ను చూడాలి... తమ బాధలు చెప్పుకోవాలని ఆపన్నుల ఆరాటం.  అభిమాన నాయకునితో కరచాలనం చేయా లి... సెల్ఫీలు తీసుకోవాలని అక్కచెల్లెమ్మలు, యువతీ యువకుల ఉబలాటం. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆసక్తిగా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఓపికగా అం దరితోనూ మాట్లాడుతున్నారు. గుండె నిబ్బరంతో భరోసా కల్పిస్తున్నారు. అందుకే ఆ ప్రజాసంకల్పయాత్రకు జనం పోటెత్తుతున్నారు. అడుగడుగునా ఘన నీరాజనం పలుకుతున్నారు. ఆయన రాకతో  పాద‌యాత్ర దారుల్లో పండగ వాతావరణం నెలకొంది. రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజన విరామానంతరం సాలూరు చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం ముగుస్తుంది.  పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌డంతో ఆ ప్రాంత‌మంతా ప్లెక్సీల‌తో నిండిపోయింది. ప‌ట్ట‌ణ‌మంతా పార్టీ జెండాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది.  బ‌హిరంగ స‌భ‌కు వేలాది జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు. బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కాకి పాండురంగ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గిరి రఘు, పార్టీ జిల్లా కార్యదర్శి దండి శ్రీను, పార్టీ సీని యర్‌ నాయకుడు సూర్యనారాయణరాజు ప‌రిశీలిస్తున్నారు.
Back to Top