వ్యవసాయాన్ని పండుగలా జరిపిస్తా


వైయస్‌ జగన్‌ను కలిసిన శనగ రైతులు
గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన
అధైర్యపడొద్దు... మంచిరోజులు ముందున్నాయి
అనంతపురం: చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయామని గుత్తి నియోజకవర్గానికి చెందిన శనగ రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ సమస్యను విన్నవించారు. గుత్తి నియోజకవర్గంలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న శనగ రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  భూమి కౌలుకు తీసుకుని రూ. 45 వేలు పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల శనగ సాగు చేశానని, పంట అమ్మితే పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతు జననేత ఎదుట వాపోయారు. రూ. లక్ష  అప్పు ఉంటే అది కూడా మాఫీ కాలేదని, చంద్రబాబు చేసే రుణమాఫీ వడ్డీలకే సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్‌ డబ్బులు కూడా రావడం లేదని రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో అంతా మోసమే జరుగుతుందని రైతులు జననేతకు చెప్పుకున్నారు. 

ఈ సందర్భంగా వూయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు రైతులను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద మే నెలలో రూ.12,500 ఇస్తామని చెప్పారు. అంతే కాకుండా తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా జరిపిద్దామన్నారు. 
Back to Top