ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తాం


విజ‌య‌న‌గ‌రం:   ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌లకు న‌వ‌ర‌త్నాల‌పై అవ‌గాహ‌నే క‌ల్పిస్తున్నారు. ఆరోగ్య‌శ్రీ గురించి వైయ‌స్ జ‌గ‌న్ జిల్లా వాసుల‌కు వివ‌రించారు. ఉత్తరాంధ్రాలో ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో విష జ్వరాలు, డెంగీతో దాదాపుగా 85 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో చూపించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తించదట. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.

♦ ఏ జబ్బు అయినా సరే వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.  
♦ కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం.  
♦ మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ రూ.6 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తాం.  
♦ క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఒకసారి కీమోథెరపీ చేయడానికి రూ.లక్ష ఖర్చు అవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్‌ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం.   
♦ ఆపరేషన్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం.

Back to Top