వరంగల్ లో వైఎస్ జగన్ పర్యటన..!

అన్ని పార్టీలకు ధీటుగా ప్రచారం..!
కేసీఆర్ మోసాలను ప్రజలంతా గమనించారు..!

వరంగల్ః
 అన్ని పార్టీలకు ధీటుగా లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారం
కొనసాగిస్తుందని వరంగల్ లో జరిగిన మీడియా సమావేశంలో రాఘవరెడ్డి స్పష్టం
చేశారు.  అధ్యక్షులు వైఎస్ జగన్ జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారని
రాఘవరెడ్డి ప్రకటించారు. మూడ్రోజుల పాటు రోడ్ షో, ఒకరోజు వరంగల్ హెడ్
క్వార్టర్స్ లో బహిరంగసభ ఉంటుందన్నారు. అదేవిధంగా నగరి ఎమ్మెల్యే రోజా 9,10
తేదీల్లో రెండ్రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు. మొత్తం
ఆరు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగసభలు ఉంటాయని, మరో దఫా 18వ తేదీన
పర్యటన ఉంటుందని చెప్పారు. 

కేసీఆర్ నియంతృత్వ
ధోరణి వల్లే ఉపఎన్నికలు వచ్చాయని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి
మండిపడ్డారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని నిప్పులు చెరిగారు. ఫీజు
రీయింబర్స్ మెంట్, సెక్రటేరియట్ సహా ఆయన ఏ కార్యక్రమం చేపట్టిన మాటల
గారడీయే తప్ప చేసేందేమీ లేదన్నారు. ఇతర పార్టీ నేతలతో లాలూచీ పడి
లాగేసుకోవడం తప్ప ఆయన ఎక్కడ బంగారు తెలంగాణ కోసం పాటుపడింది లేదని
దుయ్యబట్టారు.  కేసీఆర్ మోసాలను ప్రజలంతా గమనించారని, తగిన బుద్ధి
చెబుతారన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత
వైఎస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఆరుసంవత్సరాలయినా...ప్రజల గుండెల్లో
చిరస్థాయిగా ఉన్నారని రాఘవరెడ్డి తెలిపారు. ప్రజల మనసు గెలిచిన నాయకుడు
వైఎస్ . రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి
ప్రారంభించిన 36 ప్రాజెక్ట్ లను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కే ప్రయత్నం
చేస్తోందని రాఘవరెడ్డి  పైరయ్యారు. 

ఉపఎన్నికలో
టీఆర్ఎస్, వైఎస్సార్సీపీకి మాత్రమే పోటీ ఉంటుందని రాఘవరెడ్డి
తేల్చిచెప్పారు. టీడీపీ-బీజేపీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
మల్కాజిగిరిలో ఓడిపోయిన వ్యక్తిని దిగుమతి చేసుకున్న కాంగ్రెస్ కు మరోసారి
ఓటమి తప్పదన్నారు. మచ్చలేని నాయకుడు, దళితుల కోసం పోరాడిన నాయకుడు
సూర్యప్రకాశ్ అని రాఘవరెడ్డి అన్నారు.  దళితులంతా తమ వెంటే ఉన్నారని
స్పష్టం చేశారు.  
Back to Top