అన్నొచ్చాడు



- విశాఖ‌లో విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- 257వ రోజు జ‌న‌నేత పాద‌యాత్ర‌ ప్రారంభం
- అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
విశాఖ‌: ఉత్తరాంధ్ర ముఖద్వారంలో అడుగుపెట్టింది మొదలు విశాఖ గ్రామీణ జిల్లాలో అడుగడుగునా జననేతకు ప్రజలు బ్రహ్మరథం ప‌డుతున్నారు. ఆగస్టు 14న నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు నేటి వరకు ప్రజాసంకల్ప యాత్ర ప్రభంజనంలా సాగుతోంది.   రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. అన్నొచ్చాడు..న‌వ‌ర‌త్నాలు తెస్తున్నాడ‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు.  శనివారం ఉదయం జననేత 257వ రోజు పాదయాత్రను పెందుర్తి నియోజక వర్గం జెర్రిపోతులపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పెదనరవ, కోటనరవ, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెం, గోపాలపట్నం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

రాజన్న బిడ్డను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి జననేతకు ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.

అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ పల్లె ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదిటిపై తిలకం దిద్ది మంగళ హారతులిస్తూ దిష్టి తీస్తూ మహిళలు అక్కున చేర్చుకున్నారు. లేవలేని వృద్ధులు సైతం జననేతను చూసేందుకు గంటల తరబడి మండుటెండ, జోరు వానలను సైతం లెక్క చేయకుండా ఎదురు చూశారు. అవ్వా తాతలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యా పారులు, వివిధ కుల వృత్తులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరట పొందారు. ఇళ్లు, పింఛన్లు  ఇవ్వ‌డం లేదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న కొలువులు ఊడదీశారని, తాగు, సాగునీరు అందడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని.. ఇలా ఒకటేమిటి వందలు, వేల వినతులు వెల్లువెత్తాయి. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ చక్కని చిరునవ్వుతో పేరుపేరునా పలుకరించి వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ జననేత ముందుకు సాగారు.

‘జననేత జగనన్నా’ అంటూ లౌడ్‌ స్పీకర్లు హోరెత్తగానే ‘అన్న వచ్చేస్తున్నాడంటూ పల్లెలు బారులు తీరుతున్నాయి. నడిరోడ్డు మీదకొచ్చి వేల నయనాలు తమ ఆశల దివిటీ కోసం ఆతృతగా చూస్తున్నాయి. ప్రజానేత పొలిమేరల్లోకి అడుగుపెట్టగానే ఆ పల్లెజనం పరవశించి పోతోంది. ఎదురేగి స్వాగతం పలకడమే కాదు..దారిపొడవునా మంగళహారతులు పడుతూ తమ అభిమానాన్ని చాటుతున్నాయి. ఆయనను చూడాలని.. ఆయన మాట వినాలని ప్రజలు పరితపిస్తున్నారు. 

నేడు విశాఖ న‌గ‌రంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
ప్రజాకంటక పాలనపై సమరభేరి మోగిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఉత్తరాంధ్రలోకి అడుగిడిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం మహావిశాఖ నగరంలోకి అడుగుపెడుతోంది.  గ్రేటర్‌ విశాఖ పరిధిలోని 66వ వార్డులో కొత్తపాలెం వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కష్టాలు తెలుసుకుని.. కన్నీళ్లు తుడిచేందుకు ఎండనక వాననక పాదయాత్రగా వస్తున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికేందుకు విశాఖ నగరం ముస్తాబైంది. కొత్తపాలెం మొదలుకుని నగర పరిధిలో పాదయాత్ర సాగే దారుల్లో అడుగడుగునా స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలు,  పార్టీ జెండాలు, తోరణాలతో మహానగరం సిద్ధమైంది. అలుపెరగని మహా పాద యాత్రికుడి అడుగులో అడుగు వేసేందుకు విశాఖ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.


 

తాజా వీడియోలు

Back to Top