- వైయస్సార్సీపీపై బాబు అనుకూల మీడియా దుష్ప్రచారం
- అమెరికాలో బాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారంటూ అసత్య కథనాలు
- ఎల్లోమీడియా నిరాధార ఆరోపణలను ఖండించిన పార్టీ యూఎస్ విభాగం
- తామెక్కడా ఎలాంటి నిరసనలు చేపట్టలేదని సుస్పష్టం
- దమ్ముంటే నిరూపించాలని పచ్చమీడియాకు సవాల్
అదిగో పులి ఇదిగో మేక అన్నట్టు ఉంది ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారం. మూడేళ్లుగా పెట్టుబడుల కోసమంటూ ప్రధాని రేంజ్ లో స్పెషల్ ఫ్లైట్ లు వేసుకొని విదేశాలు తిరుగుతూ కలరింగ్ ఇచ్చుకుంటున్న చంద్రబాబు...ఇంతవరకు రాష్ట్రానికి పైసా పెట్టుబడి తెచ్చింది లేదు. ఇక బాబు విదేశాలకు పోయినప్పుడల్లా రాష్ట్రానికి దావనంలా పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం వెలిగిపోతుందంటూ అసత్య కథనాలు వడ్డించే పచ్చమీడియా...ఈసారి వైయస్సార్సీపీని టార్గెట్ చేసింది. బాబు అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడంతో వైయస్సార్సీపీపై దుష్ప్రచారానికి తెరలేపింది.
డల్లాస్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బాబు అనుకూల మీడియా మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అమెరికా పర్యటనపై ఇర్వింగ్ పోలీసులకు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందన్న ఆరోపణలను వైయస్సార్సీపీ యూఎస్ విభాగం తీవ్రంగా ఖండించింది. పచ్చ మీడియా చేస్తున్న నిరాధార ఆరోపణలను పార్టీ అమెరికా విభాగం కన్వీనర్లు రత్నాకర్ పండుగాయల, గురవారెడ్డి తోసిపుచ్చారు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు.
అమెరికాలోని డల్లాస్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ ఆందోళనలు చేపట్టిందంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడంతో పాటు వెబ్సైట్ కథనాలపైనా రత్నాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ అమెరికా విభాగం తరపున తాము ఎక్కడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదని, తాము ఫిర్యాదు కూడా చేయలేదని తేల్చిచెప్పారు. అమెరికాలో చంద్రబాబు పర్యటన విజయవంతం కాలేదన్న అక్కసుతోనే... కావాలని వైయస్ఆర్సీపీపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే పచ్చ మీడియా తన ఆరోపణలు నిరూపించాలని రత్నాకర్ సవాల్ చేశారు.
పార్టీ చందాలు, నిధుల సేకరణ విషయంలో స్థానికంగా టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన విబేధాలు బయటకు రాకుండా ఉండేందుకే వైయస్ఆర్సీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు . చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు తాము ఎలాంటి ఫిర్యాదులు కానీ, ఈ-మెయిల్స్ కూడా చేయలేదని రత్నాకర్ స్పష్టం చేశారు. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి నిరాధార వార్తలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని ఎల్లో మీడియాకు హితవు పలికారు.