వైయస్ఆర్ పై ఆరోపణలు తగదు: విజయమ్మ

హైదరాబాద్, 2 డిసెంబర్ 2012: దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖరరెడ్డి పాలనపై కాంగ్రెస్, టిడిసి సభ్యులు ఇప్పుడు ఆరోపణలు చేయడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలు శ్రీమతి విజయమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పుకోలేరన్న ధీమాతో వారు ఈ విధంగా మరణించిన వ్యక్తిపై నిందలు వేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ పాలనపై అనుమానాలుంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని శ్రీమతి విజయమ్మ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సమాధానం తర్వాత విపక్ష నేతలు మరింత స్పష్టత కోరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుకు తమ పార్టీ పూర్త మద్దతు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

అయితే దివంగత మహానేత వైయస్ పట్ల అసంబద్ధమైన ఆరోపణలు చేయడంతో ఆమె ఉద్వేగానికి గురయ్యారు. మరణించి వ్యక్తులపై ఆరోపణలు చేయడం తగదని శ్రీమతి విజయమ్మ కాంగ్రెస్, టిడిపి సభ్యులకు హితవు పలికారు. వైయస్ఆర్ పాలనపై పదే పదే ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.

శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, ‘విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. కాస్మొటిక్ చార్జీలు కూడా పెంచాలి. అలాగే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే విషయంలో రాజశేఖరరెడ్డి పాలనలో పూర్తిగా సంతృప్తస్థాయిలో మంజూరు ఉండేది. కానీ ఇప్పుడు ఇళ్ల మంజూరు విషయంలో మళ్లీ కోటా పద్ధతి అమలయ్యే పరిస్థితి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖర్చు పైన కూడా చట్టబద్ధత ఉండాలి. మరో విషయం. రాజశేఖర్‌రెడ్డి గారు సభలో లేరు. బట్టకాల్చి ముఖం మీద పారేసిన చందాన ఇటు నుంచి ఒకరు, అటు నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి గారు బయ్యారం గనులను అల్లుడికి రాసిచ్చారని, జగన్‌కు ఇంకా ఏదో రాసిచ్చారని మాట్లాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా పథకాలు అమలు చేశారు. ఈ ముఖ్యమంత్రి గారేమో సొంత ఖజానా పెంచుకోలేదు.. ప్రభుత్వ ఖజానా పెంచుతున్నానంటూ మాట్లాడుతున్నారు. అంటే అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు? ఆయన మీద మాట్లాడాల్సిన తీరు ఇదేనా? 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టు అడిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది' అని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top