విజయవాడ: రాజధాని నిర్మాణంలో గ్రామాల జోలికి వెళ్లమని చెప్పిన చంద్రబాబు.. రోడ్ల నిర్మాణం పేరుతో గ్రామాలను ఖాళీ చేయించడం తప్పని శాసనమండలి లో వైఎస్సార్ సీపీ పక్షనేత, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు . గ్రీన్ బెల్ట్ విధానం ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన విశ్లేషించారు. రాజధాని ప్రాంతంలో 30 మండలాలను గ్రీన్ బెల్ట్‑గా చేయడం సబబు కాదన్నారు. క్రిష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. నూజివీడులో ప్రభుత్వ భూమి 55 వేల ఎకరాలు ఉన్నప్పటికీ.. వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుండి భూములు లాక్కొని, వాటిని 99 ఏళ్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష నేతలపై నాన్‑బెయిలబుల్ కేసులు పెట్టి నోరు మూయించాలనుకోవడం చంద్రబాబు అవివేకమన్నారు.