<strong>అంగన్ వాడీలపై చింతమనేని దౌర్జన్యం</strong><strong>గుడ్లు, పప్పులు అమ్ముకునే మీకెందుకే జీతాలంటూ దూషణలు </strong><strong>కావాలంటే బెడ్ రూంలు ఇస్తాం తీసుకో అంటూ అవహేళన</strong><strong>చింతమనేని దిష్టిబొమ్మ దగ్ధం</strong><strong>సస్పెండ్ చేయాలని మహిళాసంఘాల డిమాండ్</strong><br/>ఏలూరుః రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజురోజుకు మహిళలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ అవుతుండడంతో నారీమణులు భయంతో వణికిపోతున్నారు. టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఏలూరు కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలపై చింతమనేని దారుణంగా బూతుపురాణం ఎత్తుకున్నారు. నోటితో చెప్పుకోలేని విధంగా మహిళను అవమానకరంగా దూషించాడు.<br/>జడ్పీ అతిథి గృహాంలో అనుచరులతో సమావేశం ముగించుకొని వస్తున్న చింతమనేనిని అంగన్ వాడీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంతే మహిళలపై అమాంతం శివాలెత్తారు. "గుడ్లు, పప్పులు అమ్ముకునే మీకెందుకే జీతాలు..వచ్చే జీతాలు సరిపోవడం లేదని రోడ్డెక్కారా" మాకే జీతాలు లేవు. మా చంద్రబాబే అద్దె ఇంట్లో ఉంటున్నారు. కావాలంటే బెడ్ రూంలు ఇస్తాం తీసుకోవాలంటూ చింతమనేని ప్రభాకర్ దారుణాతి దారుణంగా దురుసుగా, అవహేళనగా మాట్లాడారు. ప్రతి నెలా వచ్చే జీతాలే మూడు నెలలనుంచి ఇవ్వట్లేదయ్యా అని ఓ పెద్దావిడ మొరపెట్టుకున్నా వినకుండా చింతమనేని ఊగిపోయారు. అదేంట్రా ఎక్కువ మాట్లాడుతోందంటూ వారందరినీ అక్కడి నుంచి నెట్టిపడేశారు. కేసులు పెట్టిస్తానంటూ బెదిరింపులకు దిగారు.<br/>ఆగ్రహించిన అంగన్ వాడీలు చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడి నుంచి అనుచరులతో జారుకున్నారు. ఏలూరులో చింతమనేని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలను నోటికొచ్చినట్టు దుర్భషలాడిన చింతమనేనిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే చింతమనేని ప్రభాకర్ తన ఇసుకమాఫియాకు అడ్డొస్తుందని ఎమ్మార్వో వనజాక్షిని దారుణంగా కొట్టించిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.