రాష్ట్ర విభజన అంశం ఎంతో సంక్లిష్టం

న్యూఢిల్లీ, 13 నవంబర్ 2013:

ఆంధ్ర రాష్ట్ర విభజన ఎంతో క్లిష్టమైన అంశమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని జీఓఎంను కోరతామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో పార్టీ తరఫున భేటీ కావడానికి ముందు మైసూరారెడ్డి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. మొదటి ఎస్సార్సీ ఆధారంగా రెండు అసెంబ్లీల తీర్మానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విభజన కారణంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ ఇబ్బంది పడతాయన్నారు.

ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. డబు‌ల్ గే‌మ్ ఆడుతూ ప్రజ‌లను కాంగ్రెస్ పార్టీ మభ్యపెడుతోందని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజలలో వ్యక్తం అవుతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విధానం సమైక్య రాష్ట్రమే‌ అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రుల బృందం చెబుతున్న విధానాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను విడగొట్టడానికి తప్ప సమైక్యంగా చడానికి కావని మైసూరా మండిపడ్డారు. జల వివాదాలకు సంబంధించి కేంద్ర జల వనరుల మంత్రి చైర్మ‌న్‌గా ఇరు ప్రాంతాల సీఎంలు, కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరిస్తారనడం వెర్రి ఆలోచన అన్నారు.

Back to Top