అన్యాయాన్ని ప్రతిపక్షాలన్నీ అడ్డుకోవాలి

న్యూఢిల్లీ:

అడ్డగోలుగా జరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను ప్రతిఘటించటానికి ప్రతిపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ రాష్ట్రాల విభజన మొదలుపెడితే రేపు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు మరో రాష్ట్రంలోనూ ఇలాంటి దారుణమే జరుగుతుందని ఆయన రాజ్‌నాథ్‌కు వివరించారు. కాంగ్రె‌స్ పార్టీ అన్యాయంగా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటించాలని కోరారు. ఎంపీలు మేకపాటి రాజమోహ‌న్‌రెడ్డి, ఎస్పీ వై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి శ్రీ జగన్ శుక్రవారం‌నాడు ఢిల్లీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు.

రాజ్‌నాథ్‌తో సుమారు అరగంటపాటు భేటీ అయిన అనంతరం శ్రీ జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘కాంగ్రె‌స్‌ పార్టీ అన్యాయంగా చేస్తున్న రాష్ట్ర విభజన విషయమై రాజ్‌నాథ్‌ను కలిసి మళ్లీ సవివరంగా చెప్పాం. విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానం లేకుండా.. విభజన బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైతే.. తరువాత తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోనూ ఇంకొక రాష్ట్రంలోనూ ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.‌

ఇలా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని ప్రతిపక్షాలు ఒక్కటిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌కు విన్నవించినట్లు తెలిపారు. దీనిపై పార్టీ సహచరులతో మాట్లాడి త్వరగానే సరైన నిర్ణయం తీసుకుంటామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారన్నారు.‌ బీజేపీ నుంచి మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దేవుడు కూడా వీళ్లందరిలో మంచి చేసే ఆలోచన పుట్టిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘నాకు ఇంకా నమ్మకం ఉంది. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి అవుతాయని, ఒక్కటై గట్టిగా వ్యతిరేకిస్తాయని, మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. దేవుడు కూడా పై నుంచి చూస్తున్నాడు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో ఘర్షణ నేపథ్యంలో విభజన బిల్లు పెట్టుకుండా పునరాలోచించుకోవాలంటారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ‘నిన్న జరిగిన అన్యాయం చూస్తే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉందా? లేదా? అర్థం కాని పరిస్థితి. విభజన వద్దని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వ్యతిరేకించిన పరిస్థితుల్లో.. ఏ రాష్ట్రమైతే విభజనకు ఒప్పుకోవటంలేదో.. ఆ రాష్ట్రాన్ని విడగొట్టటానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

 పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టటమా? :

‘పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టేశామని ముగించేస్తారు. సాధారణంగా ఒక బిల్లు ఎక్కడైనా పెట్టినప్పుడు.. దానిని ప్రవేశపెట్టటానికి సభ అంగీకరిస్తోందా? లేదా? చేతులు ఎత్తాలని మొదట అడుగుతారు. అవును.. ప్రవేశపెట్టటానికి అంగీకరిస్తున్నామని సభ్యులు చేతులు పైకి ఎత్తుతారు. లేదు.. ప్రవేశపెట్టటానికి అంగీకరించటం లేదంటూ ‘నో’ అని చేతులు పైకి ఎత్తుతారు. అంగీకరిస్తున్నాం అన్న చేతులు, నో (అంగీకరించటం లేదు) అన్న చేతుల కన్నా ఎక్కువ లేస్తేనే.. బిల్లును సభలో ప్రవేశపెట్టాలి. అది సంప్రదాయం. కానీ ఇక్కడ ఎక్కడ ఎవరు మూవ్ చేశారో తెలియదు. సభకు అంగీకారం అవునా? కాదా? అని అడిగిందీ లేదు. చేతులు పైకి ఎత్తిన దాఖలాలూ లేవు. అయినా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టటమైందని చెప్పటం నిజంగా చాలా అన్యాయం’ అని‌ శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

అందరికీ షాక్‌ :
‘అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానంపై కూడా అలానే జరిగింది కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అసెంబ్లీలో ఏం జరిగిందనేది దేశం మొత్తం చూసింది. పార్లమెంటులో ఏం జరిగిందన్నది నా కళ్లెదుటే సాక్షాత్తుగా జరిగితే.. దాని తరువాత ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ,  ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అందరూ షా‌క్ అయ్యారు. ఇంత అన్యాయంగా జరిగిన దాఖలాలు వారు ఎప్పుడూ చూడలేదు. సుష్మా, అద్వానీ, నేను, ఎ‌స్‌పీ, బీజేడీ, ఏఐఏడీఎంకే నేతలు అందరం కలిసికట్టుగా వెళ్లి దీన్ని వ్యతిరేకించాం. ఈ రకంగా చేయటం అన్యాయమని చెప్పి వాకౌట్ చేసిన సందర్భం ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. తొలిసారిగా అది కూడా గురువారం జరిగింది’ అని ‌శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top