మాయమాటల చంద్రబాబును తరిమికొట్టండి

నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) :

మాయమాటలు, అబద్ధాలు చెప్పే చంద్రబాబును తరిమికొట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,  శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఓటర్లకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల ఆయన హయాంలో ఎన్నో కంపెనీలను తన బినామీలు సీఎం రమేష్, సుజనాచౌదరి, బిల్లీరావు లాంటి వాళ్లకు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నో కంపెనీలను మూయించి ఏడున్నర లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 26 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారన్నారు. శ్రీమతి విజయమ్మ బుధవారం విజయనగరంలో, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి, నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ, ఒమ్మి, సతివాడ గ్రామాల్లో వైయస్ఆర్ జనభేరి సభల్లో ప్రసంగించారు.

అలాంటి చంద్రబాబు‌ నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెబుతున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి. సీఎంగా ఉన్నప్పుడు 26 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసి, పలు కంపెనీలను మూసివేయించి 7.5 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్తే ఎవరూ నమ్మబోరు అని శ్రీమతి వైయస్‌ విజయమ్మ చెప్పారు.

'చంద్రబాబూ... రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం రూ.1.2 లక్షల కో‌ట్లు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే 1.5 లక్షల కోట్లు కావాలి. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తావు? కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైల్లో పెట్టించిన నువ్వు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా?’ అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. 2004లో రుణ మాఫీ కోసం రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే కేంద్రాన్ని ఒప్పించేందుకు మూడేళ్లు పట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి 60 వేల కోట్లు రుణమాఫీగా ప్రకటిస్తే, అందులో రాష్ట్రానికి 12 వేల కోట్లు కేటాయించారని చెప్పావు. అప్పట్లో రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా అప్పటికే చెల్లించిన రైతులకు వైయస్ఆర్ ‌ఐదు వేల రూపాయలు చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.

Back to Top